25న సచివాలయంలో ప్రార్థన మందిరాలు సీఎంచేతుల మీద ప్రారంభం

– తుది దశ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సర్వమత సౌభ్రాతత్వం పరిడవిల్లే విధంగా ప్రార్థన మందిరాల నిర్మాణం జరిగిందని, వీటిని ఈనెల 25న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించ నున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గుడి, మసీదు, చర్చి నిర్మాణ తుది దశ పనులను శనివారం అధికారులతో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాలు కలియ తిరిగారు. మిగిలిన చివరి దశ పనులు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.2300 గజాల స్థలంలో గుడి నిర్మాణం జరిగిందనీ, పనులన్నీ పూర్తయ్యాయని వెల్లడించారు. శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్‌, గణపతి ఆలయాల పనులు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. దేవాలయానికి సంబంధించిన విగ్రహాలను తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నామన్నారు. యాగంతో ఈ ఆలయాలు ప్రారంభం అవుతాయన్నారు. మసీదు, చర్చి కూడా ఆయా మత పెద్దల సమక్షంలో వారి మతాచారం ప్రకారం ప్రారంభించుకుంటామని తెలిపారు. తెలంగాణ అంటేనే గంగా జమునా తేహజిబ్‌ అని సర్వమత సమ్మెళితమన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కాలేయాదయ్య, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ డా.మధుశేఖర్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, డీఈలు దుర్గాప్రసాద్‌, మోహన్‌, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రైతు నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు తదితరులు ఉన్నారు.

Spread the love