అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యమైన అమెరికా మరో నల్ల జాతీయుడిని బలి తీసుకుంది. 2020 మే నెలలో జార్జ్‌ఫ్లాయిడ్‌ అనే యువకుడిని అమెరికా పోలీసులు చితకబాదడంతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఘటనను తలపించే విధంగా ఈ నెల 7న మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ యూఎస్‌ నగరమైన మెంఫిస్‌లో జరిగిన ఈ వివరాల్లోకి వెళితే.. అమెరికా పోలీసులు ఈ నెల 7న రాత్రి టైర్‌ నికోలస్‌ (29) అనే యువకుడిని పట్టుకుని రోడ్డుపై చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నికోలస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…10వ తేదీన చనిపోయాడు. కాగా, నికోలస్‌ని పోలీసులు తీవ్రంగా గాయపరిచే దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన నాలుగు వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో పోలీసులు నికోలస్‌ని పట్టుకుని చితకబాదుతున్నారు. ఆ సమయంలో ‘నేనేమీ చేయలేదు’ అని నికోలస్‌ అంటున్నా… వినకుండా పోలీసులు కొడుతూనే ఉన్నారు. ఇక మరో వీడియోలో పోలీసుల నుంచి నికోలస్‌ తప్పించుకుని పారిపోతుంటే.. అతన్ని పట్టుకుని పెప్పర్‌ స్ప్రేని ఉపయోగించారు. ఇంకో వీడియోలో నికోలస్‌ ‘అమ్మా అమ్మా’ అని అరవడం వీడియోలో వినిపిస్తుంది. వీడియోలో ఓ పోలీసు అధికారి బ్లాక్‌మెన్‌ అని అంటున్న మాటలూ వినిపిస్తాయి. ఈ వీడియోల్లోని పోలీసుల తీరును చూసిన ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నికోలస్‌ మృతికి బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, నికోలస్‌ మృతి పట్ల అతని తల్లి రోవ్‌వాన్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లా డుతూ… ‘నా కుమారుడిని పోలీసులు నుజ్జు నుజ్జుగా కొట్టడం తెల్ల జాతీయుల పరువు తీయడమే’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే నికోలస్‌ మద్యం సేవించి డ్రైవ్‌ చేయడం వల్లే తనను అరెస్టు చేసినట్టు పోలీ సులు తెలిపారు. కానీ పోలీసుల ప్రవర్తనకు ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తన కుమారుడిని కొట్టిన దెబ్బలను కప్పిపుచ్చు కునేందుకు మద్యం సేవించారని అబద్ధాలు చెబుతున్నారని ఆమె ఆరోపించారు.

Spread the love