అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు

– భద్రతా పరమైన హెచ్చరికలు ఇచ్చే కంప్యూటర్‌ వ్యవస్థలో సమస్యలు
– విమానాశ్రయాల్లో గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు
వాషింగ్టన్‌: అమెరికాలో విమానయాన సర్వీసులన్నీ హఠాత్తుగా స్తంభించి పోయాయి. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అమెరికా అంతటా సేవలు నిలిచిపోయాయి. బుధవారం రోజంతా విమానాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. విమానాశ్ర యాల్లో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమా దాల గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేసేందుకు ఎఫ్‌ఏఏ.. ఎయిర్‌లైన్లకు ఇచ్చే నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌ మిషన్స్‌) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తిం దని ఎఫ్‌ఏఏ ట్విట్టర్‌లో వెల్లడించింది. దీన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్ని స్తున్నట్టు తెలిపింది. అయితే ఇది ఎప్పటికి పరిష్కారమవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని ఎఫ్‌ఏఏ పేర్కొంది. ఈ సమస్య కారణంగా నేషనల్‌ ఎయిర్‌స్పేస్‌ వ్యవస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగినట్టు తెలిపింది. సమస్య కారణంగా అమెరికా వ్యాప్తంగా విమాన సేవలు స్తంభించిపోయాయి.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయానికి దేశవ్యాప్తంగా 400లకు పైగా విమానాల రాకపోకలకు ఆటంకం కలిగినట్టు ఫ్లైట్‌ అవేర్‌ డేటా వెల్లడించింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నామని, అధికారుల నుంచి ఎలాంటి సమాచారమూ లేదని సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిస్టమ్‌ను పునరుద్ధరిం చేందుకు ఎంత సమయం పడుతుందనేది అంచనా వేయలేమని, హాట్‌లైన్‌ను యాక్టివేట్‌ చేసినట్టు అమెరికా రెగ్యులేటర్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. సాంకేతిక లోపం తలెత్తిన పరిస్థితులను అమెరికా రవాణా మంత్రి ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించారని శ్వేతసౌధం వెల్లడించింది. సైబర్‌ దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని, అయితే సమస్యకు గల కారణాలపై పూర్తి విచారణ జరపాలని ఆయన ఆదేశించినట్టు శ్వేతసౌధం ప్రెస్‌ కార్యదర్శి ట్విట్టర్‌లో తెలిపారు.

Spread the love