ఈ కుబేర్‌లో పేరుకుపోయిన బిల్లులు

–   వెంటనే చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ కుబేర్‌లో బిల్లులు పేరుకుపోయాయని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) విమర్శించింది. వాటిని వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సప్లిమెంటరీ బిల్లులు, పీఆర్సీ బకాయిలు, సెలవు వేతనాలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిపిట్స్‌, జీపీఎఫ్‌ వంటి బిల్లులన్నీ ట్రెజరీలో ఆమోదం పొంది నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల ఖాతాల్లో నగదు జమకావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించే సందర్భంలో వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ కాకున్నా ట్రెజరీలో ఆమోదం పొందింది కాబట్టి ఆ మొత్తాన్ని ఆదాయంలో చూపించి పన్ను కట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. ఆ నగదు ఈ సంవత్సరం మార్చి 31 లోగా ఖాతాలో జమవుతుందో లేదో తెలియదు కానీ ఈ సంవత్సరమే పన్ను కట్టాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గతేడాది మార్చి 31లోపు నగదు విడుదల కాక పలు బిల్లులు రీ వ్యాలిడేట్‌ చేయించుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఇప్పటివరకు ట్రెజరీల్లో ఆమోదం పొంది రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులకు సంబంధించిన నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు వారు లేఖ రాశారు.

Spread the love