దేశంలో బీఎఫ్‌-7 కేసులు 5 నమోదు

– కోవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష
న్యూఢిల్లీ: ప్రస్తుతం చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఎఫ్‌7 భారత్‌కూ విస్తరించింది. దేశంలో ఇప్పటి వరకూ ఐదు కేసులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. దేశంలో కోవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్షుక్‌ మాండవియా బుధవారం సీనియర్‌ అధికారులు, నిపుణులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రికి అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో తొలి బీఎఫ్‌7 కేసును అక్టోబర్‌లో గుజరాత్‌ బయోటెక్నాలజీ రిసెర్చ్‌ సెంటర్‌ ద్వారా గుర్తించినట్ల్టు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ మూడు కేసులను గుజరాత్‌లోనూ, రెండు కేసులు ఒడిషాలోనూ గుర్తించినట్టు చెప్పారు. అధికారుల సమాచారం ప్రకారం చైనాలోని అనేక నగరాల్లో బిఎఫ్‌7 కారణంగానే వైరస్‌ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా బీజింగ్‌లో కేసులు ఉధృతంగా ఉన్నాయి. ‘చైనాలో బిఎఫ్‌7 అధిక వ్యాప్తికి చైనా ప్రజల్లో గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్‌ కారణంగా తగ్గిన రోగనిరోధక శక్తి, టీకాలు కూడా కారణంగా భావిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. కాగా, బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు మంత్రి మండవీయా అనేక ఆదేశాలు ఇచ్చారు. ప్రపంచంలో అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, నిఘాను పటిష్టం చేయాలని సూచించారు. నిపుణులు, అధికారులతో పరిస్థితిని సమీక్షించామనీ, కోవిడ్‌ ఇంకా ముగియలేదని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిఘాను పటిష్టం చేయాలని సంబంధింత అధికారులందర్నీ ఆదేశించామని మంత్రి ట్వీట్‌ చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్య, ఫార్మా స్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, ఆయుష్‌ శాఖలకు చెందిన కార్యదర్శులు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐబిఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ బV్‌ా్ల, నీతి ఆయోగ్‌ సభ్యులు (ఆరోగ్యం) డాక్టర్‌ వికె పాల్‌, నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టిఎజిఇఐ) చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కె ఆరోరా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love