పన్ను వసూళ్లు పెంచండి

–   అధికారులకు సీఎస్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పన్ను వసూళ్లను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర పన్నులు, పన్నుయేతర ఆదాయాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, రవాణా, మైనింగ్‌ తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న సందర్భంగా ఆయా శాఖల పన్ను వసూళ్ల లక్ష్యాలపై దష్టి సారించాలని చెప్పారు. వారాంతపు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖలు అదనపు ఆదాయాన్ని సాధించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది జనవరి చివరి నాటికి పన్నుల వసూళ్లలో రూ. 91,145 కోట్లు, పన్నుయేతర ఆదాయంలో రూ. 6,996 కోట్లు… మొత్తం రూ. 98,141 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. కమిషనర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ రాహుల్‌ బొజ్జా, కమీషనర్‌, కమర్షియల్‌ టాక్సెస్‌ నీతూ కుమారి ప్రసాద్‌, ఫైనాన్స్‌ స్పెషల్‌ సెక్రటరీ రోనాల్డ్‌ రోస్‌, డైరెక్టర్‌ ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, రవాణా శాఖ కమీషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love