కేజీబీవీలో కలుషితాహారం తిని 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

నవతెలంగాణ – వనపర్తి
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థుల్లో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వనపర్తి జిల్లా అమరచింతలో జరిగిందీ ఘటన. ఈ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిన్న రాత్రి వీరికి వంకాయ, సాంబారుతో కూడిన ఆహారాన్ని వడ్డించారు. రాత్రి భోజనం అయ్యాక 11 గంటల ప్రాంతంలో విద్యార్థినులకు కడుపునొప్పి ప్రారంభం కావడంతో ఒక్కొక్కరుగా సిబ్బంది దగ్గరకి వెళ్లారు. కేజీబీవీలో ఒక టీచర్‌, వాచ్‌మన్‌ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్థినులకు బయటకి పంపలేదు. రాత్రంతా పరిస్థితి అలాగే ఉండటంతో.. తెల్లవారు జామున ఓ ప్రైవేటు ఆటో తీసుకొచ్చిన సిబ్బంది వారందర్నీ సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లలందరికీ వైద్యులు, సిబ్బంది హుటాహుటిన చికిత్స ప్రారంభించగా.. చాలా వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. నలుగురు విద్యార్థులకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా ఆత్మకూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. తమ పిల్లల పరిస్థితి చూసి వారు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆహార కలుషితం జరిగిందా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రధానంగా 9, 10, ఇంటర్‌ విద్యార్థినులే అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. తొలుత 45 మందిని ఆ తర్వాత మరో 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆహారం విషతుల్యం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్ధినులు వాపోతున్నారు.

Spread the love