ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఈనెల 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ గతంలో చేసిన యుద్ధానికి సంబంధించిన వార్తలు రేడియోలో వినిస్తుంటాయి. మరోవైపు మన దేశంలోనే కాదు..ప్రపంచం ఆర్థిక పరిస్థితులకు సమస్యగా మారుతుందని సదరు వార్తల సారాంశం. అదే క్రమంలో మన దగ్గర రైతులు పంటలను తగలబెట్టేస్తుంటారు. మరో సీన్లో ఓ చిన్న టౌన్లోని బ్యాంకుని చూపిస్తారు. ఆ బ్యాంకుతో పాటు మరో బ్యాంకుని ఓ వ్యక్తి దోపీడీ చేస్తాడు. దీంతో పోలీసులు దొంగను పట్టుకోవటానికి రంగ ప్రవేశం చేస్తారు. ఆ సన్నివేశాలను చూపించే క్రమంలోనే ధనుష్ పాత్రను సింపుల్గా చూపించారు. ఈ పాత్ర దేని కోసమో వెతుకుంటుంది. తనను అందరూ దొంగ అని అనుకుంటుంటారు. అందుకు కారణం కొన్నేళ్లుగా హీరో ఊరికి దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి మళ్లీ ఊరికి రావటంపై కొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇంతకీ ధనుష్ నిజంగానే బ్యాంకుల్లో దొంగతనం చేశాడా? పోలీసులు అనుమానం ఎవరి వైపు ఉంటుంది? చివరికి ధనుష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే అనేలా ట్రైలర్ను కట్ చేశారు.



