పూర్తి మెజార్టీ ఉన్న టీవీకే పార్టీకి వెంటనే ఆహ్వానం ఇవ్వాలి
ఆయిల్ రెడ్డి నరసింహారెడ్డి
నవతెలంగాణ-కొండాపూర్
తమిళనాడులో పూర్తి మెజార్టీ సాధించిన టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ వెంటనే ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమని తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత ఆయిల్ రెడ్డి నరసింహారెడ్డి పేర్కొన్నారు. టీవీకే పార్టీకి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరియు ఇతర పార్టీల మద్దతు కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
గతంలో మహారాష్ట్రలో పూర్తి మెజార్టీ లేకపోయినా బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ పూర్తి మెజార్టీతో గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గత నాలుగు ఐదు రోజులుగా నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగబద్ధ వ్యవస్థకు మంచిది కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను, నాయకులను గౌరవించడం ప్రతి రాజ్యాంగ పదవిలో ఉన్న వారి బాధ్యత అని తెలిపారు. పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి హానికరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్లు రాజ్యాంగ పరిమితుల్లో వ్యవహరించాలని, ప్రజల తీర్పును గౌరవించాలని ఆయిల్ రెడ్డి నరసింహారెడ్డి కోరారు



