నవతెలంగాణ – బెంగళూరు: బెంగళూరు మహానగరాన్ని అకాల వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం భారీ ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. భారీగా గాలులు వీయడం వల్ల పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కేఆర్ సర్కిల్ అండర్పాస్లో కారు చిక్కుకొని ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ భానురేఖ ప్రాణాలు కోల్పోయారు. కుమారకృప రోడ్డు మార్గంలో చెట్టు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. చిత్రకళాపరిషత్ ఎదుట ఓ చెట్టు కుప్పకూలింది. దీంతో ఓ కారు, బైకు ధ్వంసమయ్యాయి.