Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచేనేతకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి

చేనేతకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి

- Advertisement -

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు
మన్సూరాబాద్‌‌లో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం
నవతెలంగాణ-హయత్‌‌నగర్‌

​చేనేత రంగానికి, వస్త్ర పరిశ్రమకు వేర్వేరుగా బడ్జెట్‌ కేటాయించి చేనేత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌ ‌డివిజన్‌ ‌పరిధిలోని సహరా ఎస్టేట్‌, గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం పెంటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో చేనేతకు ఘనమైన చరిత్ర ఉందని, ఒకప్పుడు కోట్లాది మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవించేవారని తెలిపారు. అంత ఉన్నత స్థానం పొందిన చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్‌ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్‌ బోర్డు, ఐసీఐసీఐ లాంబార్డ్‌ బీమా పథకం, మహాత్మా గాంధీ బునకర్‌ యోజన వంటి పథకాలను రద్దు చేసిందని తెలిపారు. చేనేత, వస్త్ర రంగాలకు కలిపి కేటాయిస్తున్న బడ్జెట్‌ కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదన్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమలకు వేర్వేరుగా బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా నిర్వహించడంతో సరిపెట్టకుండా చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్‌ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు 16 నెలలుగా త్రిఫ్ట్‌ పథకంలో డిపాజిట్‌ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలకు మాత్రమే డిపాజిట్‌ చేసిందని తెలిపారు. నేతన్న భరోసా పథకం కింద కూడా మూడు నెలలకు మాత్రమే నగదు జమ చేసిందన్నారు. చేనేత సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌ రుణాలను మాఫీ చేయాలని, చేనేత కార్మికులకు సంబంధించిన పెండింగ్‌ సమస్యల న్నింటినీ తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో చేనేత నాయకులు వై. వెంకటేశ్వర్లు, జి. ప్రకాశ్‌, జి. శ్రీశైలం, రాపోలు విశ్వనాథం, ఆర్. వెంకటేశ్వర్లు, వేముల ఆనంద్‌, డి. చంద్రమౌళి, జి. విఠళేశ్వర్‌, జి. భానుచందర్‌, ఆర్. భాగ్యలత, ఏ. మమత, వెంకటాద్రి, సహారా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ఎస్‌.డి. జానీ, జి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -