– అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారంనాడామె డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీమ్, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, పశుసంవర్ధక శాఖ సంచాలకులు రామ్ చందర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ,పౌర సరఫరాల శాఖ శాఖ కమీషనర్ అనీల్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి తదితరులతో వారి శాఖల్లోని పనుల పురోగతిని సమీక్షించారు.
వర్షాలపై…
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్, సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.