నవతెలంగాణ – లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. వీధి కుక్కను చంపిన ఓ వ్యక్తి.. దానిని తాడుతో కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పప్పు అనే వ్యక్తి ఓ వీధి శునకాన్ని కిరాతకంగా చంపేశాడు. అనంతరం దాని కాలును తాడుతో కట్టేసి రోడ్డుపై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లి.. కాలువలో పడేశాడు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన అతనికి ఓ ఆటో డ్రైవర్ సహకరించాడు. కుక్కను తాడుతోకట్టి ఈడ్చుకెళ్తుంగా పప్పు వెనక ఓ వృద్ధుడు నడుస్తున్న దృష్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన లక్నోలోని నౌబస్తా మార్కెట్ ప్రాంతంలో జరిగిందని ఏడీసీపీ చిరంజీవి నాథ్ సిన్హా తెలిపారు. అతనిపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పప్పు చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.