పాలకపార్టీల రాజకీయ క్రీడలకు లెఫ్ట్‌పై అభాండాలా?

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వచ్చే ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజునుంచి కమ్యూనిస్టు పార్టీలపై అవహేళనలూ అపహాస్యాలూ, ఆరోపణలూ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌లో టికెట్‌ రానివారి నిరసనలు ధిక్కారాలు, తిరుగుబాట్ల వార్తల కంటే వామపక్షాల భంగపాటు పేరిట కథనాలు, భవిష్యత్‌ ఎన్నికల అడుగులపై ఉచిత సలహాలు, వూహాగానాలు ఎక్కువయ్యాయి. షరామామూలుగా కమ్యూనిస్టులెప్పుడూ ఇంతే అనో, అసలీ ఎన్నికల రాజకీయాలే తప్పనో ఈసడింపులు సరేసరి, తప్పెవరిది దెప్పెవరికి అన్నట్టు ఇక్కడ కమ్యూనిస్టులపై విసుర్లు వికృత వ్యాఖ్యానాలు దేనికో బోధపడదు. ముంజేతి కంకణానికి అద్దం అన్నట్టు అన్నీ కండ్ల ముందు జరిగాయి. అధినేతల విన్యాసాలూ అందరూ చూశారు. ఇలా జరగ వచ్చనే సందేహాలు ముందే పుష్కలంగా వినిపించాయి. అయినా తీరా జరిగాక ఇందులో ప్రధానపాత్ర ధారులనూ సూత్రధారులనూ వారి వారి ఉద్దేశాలనూ అవకాశవాద వ్యూహాలను వదలిపెట్టి, ఒకే విధానంతో ఒకే మాట మాట్లా డుతున్న కమ్యూనిస్టులపై దాడికి దిగడం వింతల్లో వింత. సందర్భం ఏదైనా, సారాంశం ఏమైనా తేలిగ్గా తేరగా దాడికి దొరికేది కమ్యూనిస్టులేనని కొంతమంది ఉద్దేశం. కొన్ని మీడియాల అంచనా. కమ్యూనిస్టుల సొంత పాత్రనూ ఉద్యమా లనూ తక్కువ చేసి చూపడం, ఎన్నికలలో వారితోనో వీరితోనో కలిపి మాత్రమే చూపడం, అందుకు మళ్లీ వారినే నిందించడం గేళి చేయడం ఈ తరహా విమర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నది అలాంటి ప్రహసనమే. ఇందులోనే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలనూ కలగలిపి ఓ రాయి విసిరి కక్ష తీర్చు కునేవారు మరికొందరు. ఈ పరిణామాలపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వాలూ విడివిడిగానూ ఉమ్మడిగానూ చర్చించి చెప్పవలసింది చెప్పాయి. భవిష్యత్‌లో ఏం చేయాలనే దానిపై ఆయా కమిటీలు సమీక్షిస్తు న్నాయి. ఆ నిర్ణయాలు ఎలాగూ వస్తాయి, పాలకపార్టీలలోవలెగాక వామపక్ష పార్టీలలో సమిష్టిగా తీసుకున్న విధాన నిర్ణయమే శిరోధార్యమవుతుంది. కాకపోతే సందట్లో సడేమియా తరహాలో ఈ చాటున వాస్తవాలను వక్రమార్గం పట్టించే వారికి వాస్తవాలతోనే జవాబు చెప్పవలసి వస్తున్నది.
బీజేపీపై పోరాటం…మునుగోడు విజయం
వాస్తవానికి ఈ కథ ఎక్కడ మొదలైంది? కేసీఆర్‌ హఠాత్తుగా ఒక రోజున బీజేపీ మతోన్మాదం, కేంద్రం పెత్తనం, ప్రధాని మోడీ నిరంకుశ పోకడలపై తీవ్ర భాషలో ధ్వజమెత్తారు. వామపక్షాల జాతీయ నాయకులతో చర్చలు జరిపారు. బీఆర్‌ఎస్‌గా జాతీయ రూపం తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక నాటికి బీఆర్‌ఎస్‌ దాదాపు ఎన్నికల సంఘం గుర్తింపు పొం దింది. అయినా మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌గానే పోటీ చేశారు. ఆ ఎన్నికలో వామపక్షాల మద్దతు కోరడం, వారు కీలకంగా సహకరించడం జరిగాయి. నిజానికి అది సీపీఐ గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానమైనా వామపక్షాలు మనస్పూర్తిగా సహకరించాయి. అప్పుడే బీజేపీ కేంద్రం ఆపరేషన్‌ ఫాంహౌస్‌కు పాల్పడింది. మరోవైపున ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరిట కేసీఆర్‌ ప్రభుత్వంపైనా, కుటుంబంపైనా దారుణమైన దాడి సాగించింది. మునుగోడు విజయం వామపక్షాల మద్దతువల్లనేనని అందరూ అంగీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా బీజేపీ నిరంకుశత్వానికి కక్ష సాధింపులకూ వ్యతిరేకంగా మిగిలిన ప్రతిపక్షాలతో కలసి బీఆర్‌ఎస్‌ గొంతు కలిపింది, ఈడీ దాడులను నిలవరించాలని సుప్రీం కోర్టులో మిగిలిన వారితో పాటు కేసు వేసింది. ప్రతిసందర్భంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పని చేస్తామని సంకేతాలిస్తూ వచ్చారు. వామపక్షాలు సహజంగానే అందుకు సానుకూలంగానే స్పందిం చాయి.వీలైనన్ని లౌకిక పార్టీలను బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా సమీకరించాలని కోరుకునే వామపక్షాల వైఖరి కారణంగానే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ వంటివారు హైదరాబాద్‌ వచ్చినప్పుడు కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్య దర్శులు కూడా కలిశారు. ఈ అన్ని సమయాల్లోనూ కూడా మీడియా ఎన్నికల పొత్తుల గురించి అడగడం, బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు ఒక తాటిమీదకు రావడం అవసరమని వారు చెప్పడం జరుగుతూ వచ్చింది. తెలంగాణలో కచ్చితంగా ఏం జరుగుతుందనేది వారెప్పుడూ చెప్పింది లేదు.
నిజంగా జరిగిందేమిటి? ఎవరి విధానం మారింది?
గవర్నర్‌ తమిళసైతో ప్రభుత్వం పట్ల ప్రతికూల వైఖరి తీసుకోవడం, బిల్లులను నిర్ణయాలను నిలిపివేయడం, ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్‌ షా వంటివారు అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజరు వంటివారు కేసీఆర్‌పై తీవ్రంగా మాటల దాడి చేయడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి, పార్లమెంటు ఓటింగులోనూ బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలతో బీజేపీ వ్యతిరేక వైఖరినే తీసుకుంది. ఇన్ని కారణాల వల్ల నిర్దిష్టంగా ప్రతిపాదనలు, స్పష్టమైన చర్చలు జరగకపోయినా బీఆర్‌ఎస్‌ వామపక్షాల సర్దుబాట్లు వుంటాయనే భావన బలపడింది. సరైన సమయంలో కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్‌ వంటివారు చెబుతూ వచ్చారు. మరోవైపున కమ్యూనిస్టు లకు ఒక అసెంబ్లీ ఒక కౌన్సిల్‌ స్థానమివ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు మీడియా పదేపదే కథనాలు ఇచ్చింది. మధ్యలో బీఆర్‌ఎస్‌ కీలకనేతలు కొందరు కెేసీఆర్‌ దూతలుగా లేక పార్టీ తరపు నాయకులుగా పేర్లతో సహా ఇదే ప్రతిపాదన తెచ్చినపుడు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనంగీకారం తెలిపాయి. కేసీఆర్‌తో ముఖా ముఖి మాట్లాడాలని ప్రతిపాదించాయి.వారికి చెప్పడమే గాక ఆయనను కలుసుకోవాలనే సూచన బహిరంగంగానే చేశాయి. కేసీఆర్‌ మాటల్లో బీజేపీపై విమర్శల తీవ్రత తగ్గి కాంగ్రెస్‌పై దాడి పెరుగుతున్నదనే అంశం ఈలోగా చర్చనీయమైంది. కవితపై కేసు ద్వారా మోడీ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నట్టు వార్తలు వస్తున్నా వామపక్షాలు తమ విధానం యథాతథంగా కొనసాగించాయి. ప్రాంతీయ పాలక పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీతో చేతులు కలపడం వల్లనే అది బలపడిందనీ మూడో కూటమి నిర్దిష్టరూపం కూడా ఆ క్రమంలో ఎన్నికల తర్వాత గాని స్పష్టం కాదని సీపీఐ(ఎం) చాలాసార్లు చెప్పింది. నిజానికి సీతారాం ఏచూరి దేశంలో ఎన్నికల ఫలితాల తర్వాత (పోస్ట్‌ పోల్‌) మాత్రమే కూటములు సాధ్యమని చాలాసార్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల స్థానే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి మాట్లాడినపుడు కూడా అందులో సవాళ్లను వామపక్షాలు ఎన్నడూ విస్మ రించింది లేదు. బీజేపీ వ్యతిరేక లౌకిక పక్షాల ఐక్యత, అందులో కాంగ్రెస్‌ కూడా వుండాల్సిన అవసరం గురించి వైఖరి మార్చుకున్నదీ లేదు.
నిరాధార ఆరోపణలెందుకు?
కేసీఆర్‌, నితీశ్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ వంటివారు తామే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అనేక కథలు వచ్చాయి. వామపక్షాలు తమవిధానం బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి కూడా స్పష్టంగా చెప్పాయి. కేసీఆర్‌ తప్ప మిగిలిన వారు నెమ్మదిగా కలసి రావడంతో ఈ క్రమంలో ఇండియా కూటమి ఏర్పడింది. ఇందులో ఏదీ కొత్త విషయం గానీ ఏకపక్షంగా లోలోపల జరిగింది కానే కాదు. ”తెలుగు రాష్ట్రాలలో కమ్యూనిస్టుల ధోరణి వారి జాతీయ ప్రాధాన్యాలకు భిన్నంగా కనిపిస్తున్నది” అని ఒక తెలుగు పత్రిక సంపాదకుడు రాయడం నిరాధార ఆరోపణ. ఆ విధానాన్ని నిలబెట్టడం కోసమే వారు ఇంత ఓపిగ్గా క్లిష్ట పరిస్థితుల మధ్య పోరాడవలసి వచ్చింది. కమ్యూ నిస్టులతో అవగాహన అంటూ ప్రతినిధులను పంపించి, తామే ఏకపక్షంగా ముగించి తమ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీఆర్‌ఎస్‌ నేతలు లేదా వారి మీడియా ఇప్పుడు ఇండియా కూటమిలో వామపక్షాల చేరిక వల్ల ఇలా జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదం. సూటిగా చెప్పలేని ఇరకాటం, కేంద్రం ఒత్తిడి వంటి రాజకీయ కారణాలు వుండొచ్చునని చాలామంది భావించడానికి కారణమదే. బీజేపీపౖౖె వున్న పెద్ద ఫిర్యాదే అది.
సముచిత విధానంతో ముందుకు…
కనుక ఏ ఒక్కరోజు వామపక్షాలు తమ జాతీయ విధానాన్ని దాచిపెట్టుకోవు. బీజేపీకి వ్యతిరేకంగా మరిన్ని లౌకిక పార్టీలను కలుపుకుని పోరాడలనేది వామపక్షాల నికరమైన వైఖరి. ఆ మాటకొస్తే ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి అనుకూలంగా లోబడి వుండటంపై సీపీఐ(ఎం) ఎప్పుడూ విమర్శ ఆపింది లేదు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారపార్టీ తన దుష్పరిపాలనతో ప్రజాందో ళలనలకూ అవకాశం కల్పిస్తున్నది. అయినా వారి తీరు అక్కడ నిస్ప్రహనే కలిగిస్తున్నది’ అని పై సంపాదకుడు రాస్తున్నారు. నిజంగా ఆ మూడు ప్రాంతీయ పార్టీలు అసహన రాజకీయాలతో పరస్పర దూషణలలో మునిగితేలుతూ నిజమైన సమస్యలను విస్మరిస్తుంటే వాటిపై పోరాడుతున్నది ప్రజల ఎజెం డాను ముందుకు తెస్తున్నది వామపక్షాలు, ప్రజాసం ఘాలు మాత్రమే. మరి ఈయన చెబుతున్న నిస్ప్రహకు కారణమేమిటో అర్థం కాదు. బహుశా బీజేపీ అండకోసం నిరీక్షిస్తున్న పార్టీలతో కలసి పోతామని ప్రకటిం చాలని కోరుతున్నారేమో. ఏపీ సీపీఐ విషయమై ఏవో వూహాగానాలు కొందరు చేస్తే సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తాము అలా భావించడం లేదని సమాధానమిచ్చారు. బీజేపీతో కలసి పనిచేసే పార్టీలతో వామపక్షాలు కలిసే ప్రసక్తి వుండదని కూడా అన్నారు.ఈ జాతీయ విధానానికి ఏ రాష్ట్రం మినహా యింపు కాదు, ఇంత స్పష్టమైన విధానం, పారదర్శక వైఖరి వుండకూడదనన్నట్టు కొందరు మాట్లా డడం మరీ విడ్డూరం. దాగుడుమూతలు ఆడాల్సిన అవసరం వామపక్షాలకేముంది?.వారేదో బీఆర్‌ఎస్‌ గురించి భ్రమపడిందీ ఆశపడి భంగపాటుకు గురైంది అంత కన్నా లేదు. కరివేపాకులా తీసేశారనీ, పాలక పార్టీల ముందు మోసపోయారని కొందరు సానుభూతి వొలకబోయడం కూడా వృథా ప్రయాసే. ఇన్ని దశాబ్దాల లోనూ పాలక పార్టీల తీరుతెన్నులు, తమ స్వంత వైఖరిని ఉద్యమా లనూ కాపాడుకోవలసిన అవసరం కమ్యూనిస్టులకు తెలియవనుకోవడం పొరబాటు. ఏదోలా పొత్తు పెట్టుకోవడమే పరమార్థమైతే ఇంతచర్చ వుండేదే కాదు. అలాగే ఇప్పుడు ఏం జరగాల నేది కూడా రాజ కీయ పరిణామాలను అవకాశాల నుబట్టి విధానపరంగా నిర్ణ యించుకుంటాయి. ఈ క్రమంలో ఎవరు నేర్చు కోవల సింది వారే నేర్చుకోక తప్పదు. ప్రమాదకరమైన ప్రతీ ఘాతశక్తులతో పోరాడాల్సిన కర్తవ్యం, మతోన్మాదాన్ని నిరోధించాల్సిన సవాలు తీవ్రత తక్కువ చేస్తూ ప్రజా స్వామిక శక్తులను అవహేళన చేయడం తగని పని.
తెలకపల్లి రవి 

Spread the love