‘ఆఖరి యోధులు’

'The Last Warriors'‘విప్లవానికి మహాపురుషులే కారణంగా కన్పిస్తుంటారు. కానీ నిజమేమిటంటే, ప్రజలే స్వయంగా విప్లవానికి కారణం’ ఈ మాటలు 1931లో ఎరవాడ జైలు నుండి ఎం.కె.గాంధీ రాసిన లేఖలోని వాక్యాలు ‘ప్రజలే చరిత్ర నిర్మాత’లని మార్క్స్‌ చెప్పిన విషయాన్ని రుజువు చేస్తున్నాయి. నాయకులు అవసరమే కాదు ముఖ్యం కూడా. కాని ఉద్యమ నిర్మాణంలో పునాది మాత్రం సాధారణ ప్రజలే. ఈ సాధారణ సామాన్య ప్రజల బాధలగాధల గుర్తింపే నిజమైన చరిత్ర. గతం, కేవలం జరిగిపోయిన చరిత్ర మాత్రమే కాదు. వర్తమానపు చైతన్యం,భవిష్యత్తు నిర్దేశిత ఆశయం కూడా. అందుకనే మనం అప్పుడపుడయినా మన పూర్వ సమాజ చరిత్రను పరికించాలి. మనకు ముందున్న తరాల జీవనాన్ని, ఆలోచనలను ఆధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం నిలబడిన ఉనికి ఆధారం ఏమిటో బోధపడుతుంది. ఏ త్యాగాల నీడలో సేద తీరుతున్నామో తెలిసి వస్తుంది. అట్లా తెలుసుకోవడానికి ‘ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని కథ’లన్నింటినీ కొన్ని సంవత్సరాలుగా శ్రమించి, ఏరికూర్చిన చైతన్యపు సంపుటి ‘ఆఖరియోధులు’ అనే పుస్తకం. దీనిని ప్రముఖ ప్రజాపాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ ‘లాస్ట్‌ హీరోస్‌’ అనే పేరుతో ఇంగ్లీషులో డెబ్బయి ఐదేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా బహుమతిగా మనకు అందించారు. అది మనకిప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి రావడటం ఒక గొప్ప అవకాశం.
మొన్ననే మనం 76యేండ్లు పూర్తి చేసుకున్న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్నాము. స్వాతంత్య్రమంటే ఏమిటని నిర్వహించుకుంటున్నాం మనం. దీనికోసం ఎన్నివందల ఏండ్లుగా పోరాడాము, ఎన్ని త్యాగాలు చేశాము. చరిత్రకెక్కకుండా చేసిన త్యాగలెన్నీ- ఇవన్నీ ఇప్పటి తరానికి పట్టని విషయాలుగా మారిపోయాయి.అది మాత్రమే కాదు. చరిత్రను, చరిత్రలో ప్రజలు, నాయకులు నిర్వహించిన పాత్రనూ పూర్తిగా కనుమరుగు చేస్తూ వక్రీకరణకు పాల్పడుతున్న సందర్భంగా ఈ చైతన్యపూరిత చరిత్రపుటలు మనల్ని మేల్కోల్పుతాయి. మనగతం, గతంలోని అభిమతం తెలుసుకోకుండా గమనం సరిగా కొనసాగదు. భవిష్యత్తునూ కలగనలేము. గొప్ప ప్రేరణను, భవిష్యత్తు పట్ల ఆశనూ రేకెత్తించే ఉద్విగపూరిత రచన ఇది. ‘మేము స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అన్న రెండు లక్ష్యాలతో పోరాడాము. స్వాతంత్య్రం మాత్రమే సాధించాం. స్వేచ్ఛనింకా పొందవలసే వున్నది. అది కూడా ఈనాడు కొద్దిమంది చేతుల్లో గుత్తసొమ్ముగా మారింది’ అని మహారాష్ట్రకు చెందిన కెప్టెన్‌ భావు రామచంద్ర శ్రీపతిలాడ్‌, ఆనాడు బ్రిటీష్‌ పరిపాలనకు సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపిన తుఫాన్‌సేన సభ్యుడు చెప్పిన మాటల్లాంటి అనేక మంది యోధుల భావాలను రికార్డు చేసిన పుస్తకమిది. విప్లవవీరుడు భగత్సింగ్‌ మేనల్లుడు ప్రొఫెసర్‌ జగ్మోహన్‌ ఈ చరిత్ర గ్రంథానికి ముందుమాట రాస్తూ…’ఆ కాలంతో పోరాటాలు నడిపి, ఇప్పటికీ బతికి వున్న కొద్దిమంది చెప్పే గాథలను తెలుసుకోవడం కంటే ఉత్తేజ భరితం ఏముంటుంది? విచారించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు యువతరం స్వాతంత్య్ర ఉద్యమ సంస్కృతి నుండి వేగంగా దూరమవుతోంది. వారికి సమాజ వికాసానికి తోడ్పడే సామాజిక విలువల గురించి తెలవదు. ఎవరూ చెప్పలేదు. కానీ ఇప్పుడు మరీ వక్రీకరణకు గురవుతోంది’ అని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితిలో ఈ పుస్తకం ఓ కాంతిరేఖ.
భారతదేశంలో బ్రిటీష్‌ పాలన వల్ల ఏర్పడిన కరువులు, దారిద్య్రాలు, వ్యాధుల వల్ల అమెరికా, కెనడా వంటి ప్రాంతాలకు వలసెల్లిన వారు, ఇండియాలో తమ సోదరులు అనుభవిస్తున్న కష్టాల గురించి , బానిసత్వం గురించి తెలుసుకుని 1914 ప్రాంతంలోనే దేశానికొచ్చి గదర్‌ తిరుగుబాటుదారులుగా పాల్గొన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు.వాళ్లేమి గుర్తింపు కోసం పనిచేయలేదు. ఒరిస్సాలో ఆదివాసీ మహిళలు ‘సాలిహాన్‌’ కానీ , దేమతిదేరు సబర్‌ సాలిహాన్‌ కానీ హౌసాబాయి పాటిల్‌ కానీ తెలంగాణ వీరనారి మల్లు స్వరాజ్యం కానీ, తమిళనాడు లోని శంకరయ్య, ఒడిషా లక్ష్మీపాండా, బెంగళూరు దొరెస్వామి, పాండిచ్చేరి నల్లకణ్ణు, బాజీ మహమ్మద్‌, పురూలియా భబానిమెహతో… ఇంకా ఎందరెందరో చరిత్రకెక్కని యోధులు ఏ రకమైన గుర్తింపుల కోసం పాకులాడకుండా ఉద్యమానికి జీవితాలను ధారపోసినవారే.2018లో రైతులు చేసిన పోరాటాన్ని చూసి గొంతుకలిపిన వాళ్లే. సాధించిన స్వాతంత్య్రం ప్రజలను ఇంత దారుణంగా చూస్తున్నందుకు పోరు సాగించాలని ప్రేరణనిచ్చినవారే. అట్లాంటి వీరుల ఉద్వేగపూరిత చరిత్ర. ప్రభుత్వ నిబంధనల, నిర్వచనాల ప్రకారం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించబడని వాళ్లను గుర్తించిన పుస్తక మిది. ఏ ఒక్కరో, కొందరో చేస్తే వచ్చిన స్వతంత్రం కాదిది. దళితులు, ఆదివాసీలు, ఒబీసీలు, బ్రాహ్మణులు, ముస్లింలు, హిందువులు, సిక్కులు, మహిళలు, పురుషులు, పిల్లలు, అనేక భాషలు, భిన్న సంస్కృతుల గల వారెందరో పోరాటంలో పాల్గొన్నారని, అలా పోరాడి బతికున్న అనేకమంది మనోభావాలను, పోరాట సంఘటనలను, దృశ్యాలను ఎంతో ఆసక్తిగా కథనాత్మకంగా నమోదు చేసిన పుస్తకం ‘ఆఖరి యోధులు’ అందరూ గుండెకు హత్తుకోవాల్సినది.గొప్ప అనుభూతిని నింపుతుంది.

Spread the love