నవతెలంగాణ న్యూఢిల్లీ: మరో ఇద్దరు ఎంపీల రాజీనామాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బాలక్నాథ్, ఛత్తీస్గఢ్ బరిలో దిగి గెలిచిన రేణుకాసింగ్ల రాజీనామాలను ఓం బిర్లా నేడు ఆమోదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 మంది గెలుపొందగా.. వారిలో 11 మంది లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
వీరంతా తమ ఎంపీ పదవులకు ఇటీవల రాజీనామా చేయగా.. నిన్న 9మంది ఎంపీల రాజీనామాలను ఆమోదించిన లోక్సభ స్పీకర్.. శుక్రవారం మిగిలిన ఇద్దరు ఎంపీల రాజీనామాలకు ఆమోదముద్ర వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వారిలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, రాకేశ్ సింగ్, ప్రతాప్ సింగ్, రితి పాఠక్(మధ్యప్రదేశ్), దియా కుమారి, రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, బాలక్నాథ్ (రాజస్థాన్), గోమతి సాయి, అరుణ్ సావో, రేణుకా సింగ్(ఛత్తీస్గఢ్)తో పాటు రాజ్యసభ ఎంపీ కిరోరి లాల్ మీనా (రాజస్థాన్) ఉన్నారు.