– పైప్ తగిలి కార్మికుడు మృతి
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ – గోదావరిఖని/ రామగిరి
సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు (ఎఎల్పి)లో మంగళవారం రాత్రి రెండో షిఫ్ట్లో ప్రమాదం జరిగింది. ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి పనులు జరుగుతున్న సమయంలో లాంగ్ వాల్ మిషన్కు ఉన్న ఓస్ పైప్ ఒక్కసారిగా ఊడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎంజెడబ్ల్యూ కార్మికుడు బూర్ల సారయ్య(40) ఛాతికి బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గోదావరిఖని పట్టణంలోని సింగరేణి రామగుండం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సారయ్య కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రిలో కార్మికుని మృతదేహాన్ని పలువురు రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల నాయకులు బుధవారం పరిశీలించారు.
ఉత్పత్తిపైనే శ్రద్ధ..
సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికులకు రక్షణ ఏర్పాట్లు చేయడంతో యాజమాన్యం చూపడం లేదని ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. కార్మికుడు సారయ్య మృతదేహాన్ని ఆయన సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి అధికారులు వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు దొమ్మేటి కొమురయ్య, ఎం.వెంకటేశ్వర్లు, ఎండి.అహ్మద్ పాషా, డి.రవి కుమార్ తదితరులున్నారు.