ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్
నవతెలంగాణ-చేవెళ్ల
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్య సంస్థలపై చర్యలు తీసుకునీ, ఫీజు నియంత్రణ చట్టం తేవాలనీ పీడీ ఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానా పురం రాజేష్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రయివేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్స్ నిర్వహిస్తున్నాయని అన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులను నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రయి వేట్ పాఠశాలలు, కళాశాలలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతీ పాఠశాల, కళాశాలల్లో ఫీజు డిటైల్స్ తో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. నియమ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను వారి తల్లి దండ్రులను మభ్య పెడుతూ అడ్మిషన్లు చేస్తున్నారని దుయ్య బట్టారు. జీవో నెంబర్ 1ని తుంగలో తొక్కి అక్రమంగా అడ్మిషన్స్ చేస్తున్న పాఠశాలల, కళాశాలల పైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ కలిగిన అధ్యా పకులను నియమించి, విశాలమైన తరగతి గదుల్లో బోధన చేయాలన్నారు. ఇరుకైన గదులు, సరైన గాలి వెలుతురు లేని గదుల్లో విద్యార్థులను కూర్చోబెట్టొద్దని హెచ్చరించారు. యూనిఫాం ఫీజు, పాఠ్య పుస్తకాల ఫీజులను తగ్గించాలని, నాన్ టీచింగ్ స్టాఫ్ను ఏర్పరచుకోవాలని కోరారు. ఆదివారాలలో క్లాస్లు నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు కోజ్జంకి జైపాల్, కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.