పాకిస్థాన్‌లో హిమపాతం..10 మంది మృతి

నవతెలంగాణ – ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌-బాల్టి్స్థాన్‌ రీజియన్‌లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం విరుచుకుపడింది. దీంతో 10 మంది గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పర్వత ప్రాంతంలోని ఆస్టోర్‌ జిల్లాలోని షంటర్‌ టాప్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గుజ్జర్‌ కుటుంబానికి చెందిన 25 మంది పీఓకే నుంచి ఆస్టోర్‌కు తమ పశువులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్నదని చెప్పారు. గాయపడినవారిలో 13 మందిని దవాఖానకు తరలించామని, వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని పాక్‌ మీడియా వెల్లడించింది. ఈ దుర్గటనపై పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పాక్‌ను రక్షించాలని ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ముఖ్యమంత్రి ఖలీద్‌ ఖుర్షీద్‌ సంతాపం వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Spread the love