క్యాన్సర్‌తో వ్యక్తి మృతి, అతడి చితి మంటల్లో దూకిన స్నేహితుడి దుర్మరణం

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్‌
క్యాన్సర్‌తో మరణించిన స్నేహితుడి చితి మంటల్లో దూకాడో వ్యక్తి. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగ్లా ఖాంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే అశోక్(42) కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో యమునానది తీరంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ స్నేహితుడు ఆనంద్(40) కూడా అతడికి తుది వీడ్కోలు పలికేందుకు అక్కడికి వచ్చాడు. అయితే, అశోక్ చితికి నిప్పంటించాక అందరూ తిరిగి వెళ్లిపోతున్న తరుణంలో ఆనంద్ ఒక్కసారిగా స్నేహితుడి చితిలో దూకేశాడు. మంటల్లో పడి కాలిపోతున్న అతడిని అక్కడున్న వారు రక్షించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడికి అత్యవసర చికిత్స అందించి ఆగ్రా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఆనంద్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు.

Spread the love