– స్థానికేతరులు పదవులను పోస్టులా వినియోగించుకుంటాండ్లు
– సహజన వసరులను ఉపయోగించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా
– రెండు జిల్లాల్లో మూడు పంటలకు సాగునీరు అందించేలా కృషి చేస్తా
– పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నతానియల్
నవతెలంగాణ – మంథని
ఈ ప్రాంతంపై అవగాహన, పట్టు ఉన్నోళ్లకు అవకాశం కల్పిస్తే అభివృద్ది చేస్తారని పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నతానియల్ అన్నారు. సోమవారం మంథని ప్రెస్క్లబ్లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ వాసినని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన తాను ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా హెచ్ఎం,మండల విద్యాధికారిగా సేవలు అందించానని తెలిపారు. ప్రజా సేవ చేయాలని,ఈ ప్రాంతాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతో పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.తనకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పిస్తే అనేక అభివృద్ది సేవలు అందిస్తానన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో లేని విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తానని,అలాగే మంచిర్యాలలో హైకోర్టు బేంచ్,మెడికల్ కళాశాల, మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానన్నారు.రెండు జిల్లాలను ఆనుకుని గోదావరినది ప్రవహిస్తోందని,ఈ క్రమంలో రెండు జిల్లాల్లోని రైతులు మూడు పంటలు తీసుకునేలా సాగునీరు అందిస్తానని హమీ ఇచ్చారు.అదే విధంగా ఈ ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయని,ప్రస్తుతం వాటిని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోవడంతో ఈ ప్రాంతం అభివృద్దిలో వెనుకబడిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.స్థానికేతరులకు అవకాశాలు కల్పించడం మూలంగా వారు పదవులను పోస్టుల్లా బావించి వ్యక్తిగతంగా ప్రయోజనాలు పొందుతూ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలివేస్తున్నారని ఆయన వివరించారు.తాను అలా కాకుండా ఈప్రాంతంలోని ఇసుక, గ్రానైట్,బొగ్గు,నీరులాంటి సహజ వనరులను ఉపయోగించి ఇక్కడ ఇండస్త్రీయల్ హబ్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు ఉండటం మూలంగానే భూముల విలువలు పెరుగుతున్నాయని,ఇదే క్రమంలో ఇక్కడ ఇండస్త్రీలు ఏర్పాటు అయితే భూముల విలువలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.తనకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పిస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని,సీరియల్ నంబర్ 41బకెట్ గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో రెడ్డి సంఘం అధ్యక్షులు కర్రె మహేందర్రెడ్డి,వాసాలజాన్,ఈర్ల సదానందంతో పాటు తదితరులు పాల్గొన్నారు.