పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని సాగనంపి, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొద్దామని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌, యు.బుగ్గప్ప అన్నారు. బుధవారం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మండలం మల్కాపూర్‌తో పాటు వివిధ గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. బీజేపీ పదేండ్ల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాధించిన డబ్బును జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్ది మంది పెట్టుబడుదారులకు కట్టబెడుతూ, బడా పెట్టుబడిదారులకు వేలకోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సెక్టార్‌కి సంబంధించిన సంస్థలను ప్రయివేటీకరణ చేసిందన్నారు. ప్రయివేటీకరణలో రిజర్వేషన్లు రద్దు అవుతాయనీ, కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందనీ, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. స్వాతంత్ర సమరయోధులకు, ఇతర వ్యక్తులకు మతం రంగు పుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు పెరిగిపోయాయనీ, రైతు, కార్మిక వ్యతిరేక నల్లా చట్టాలను తెచ్చి, సంక్షోభంలోకి నెట్టివేసిన బీజేపీని ప్రజలందరూ ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ విజయలక్ష్మి పండరి శరణప్ప, వెంకట రాములు, లక్ష్మి, అంజిలప్ప, కార్మికులు, మహిళలు, సీపీఐ(ఎం) నాయకులు, రాములు, రేణుక, లాలప్ప, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love