బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్‌కు క్యాన్సర్

నవతెలంగాణ – హైదరాబాద్: బ్రిటన్ రాజకుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతోంది. రాజు ఛార్ల్స్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న తరుణంలోనే బ్రిటన్‌ యువరాణి కేట్ మిడిల్‌టన్ కూడా క్యాన్సర్ బారినపడ్డట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. తను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న విషయాన్ని కేట్ స్వయంగా తెలిపారు. బ్రిటన్‌ సింహాసనానికి వారసుడు యువరాజు విలియమ్స్‌ భార్య కేట్ అన్న విషయం తెలిసిందే. కేట్ జనవరిలో ఉదరభాగంలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పట్లో రెండు వారాల పాటు ఆసుపత్రిలోనే గడిపారు. ఆపరేషన్‌కు గల కారణాలు ఏంటో తెలియరానప్పటికీ అది క్యాన్సర్ సంబంధిత సమస్య కాదని మాత్రం మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, తదుపరి జరిపిన పరీక్షల్లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డట్టు వెల్లడైంది. దీంతో, వ్యాధి మరింత ముదరకుండా ప్రివెంటివ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాని కేట్ తాజాగా వీడియో సందేశంలో తెలిపారు. ‘‘నా మెడికల్ టీం సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నా. ఈ ట్రీట్‌మెంట్ ప్రస్తుతం తొలి దశల్లో ఉంది’’ అని చెప్పారు. క్యాన్సర్ ఉందని తెలిసి తను, తన భర్త చాలా షాక్‌కు గురయ్యామని కేట్ అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని కూడా చెప్పారు. ఇక ఈస్టర్ తర్వాతే కేట్ తన రాచరిక విధుల్లో పాల్గొంటారని రాజభవనం ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ రాజు ఛార్ల్స్ కూడా క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది. ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ అప్పట్లో ప్రకటించింది. జనవరిలో ఆయన కేట్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిలోనే ప్రోస్ట్రేట్ గ్రంధి సమస్యకు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. కాగా, కేట్ క్యాన్సర్ వార్తపై స్పందించిన రాజు ఛార్ల్స్ ఈ క్లిష్ట సమయంలో ఆమె ధైర్యసాహసాలను ప్రశంచించారు.

Spread the love