ముంబయిపై 8 వికెట్లతో గెలుపు
రాణించిన రుతురాజ్, కార్తీక్ శర్మ
ముంబయి 159/7 చెన్నై 160/2
నవతెలంగాణ-చెన్నైఐపీఎల్ అగ్రజట్ల సమరంలో చెన్నై సూపర్కింగ్స్ డబుల్ ధమాకా. ముంబయి ఇండియన్స్ను వాంఖడెలో ఓడించిన చెన్నై సూపర్కింగ్స్.. అదే ప్రదర్శన చెపాక్లోనూ
పునరావృతం చేసింది. 160 పరుగుల ఊరించే లక్ష్యాన్ని చెన్నై సూపర్కింగ్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్, 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), కార్తీక్ శర్మ (54 నాటౌట్, 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ సంజు శాంసన్ (11) రెండు ఫోర్లతో దూకుడుగా ఆడినా.. వికెట్ నిలుపుకోలేదు. ఊర్విల్ పటేల్ (24)తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు జోడించాడు. రెండు సిక్స్లు, రెండు ఫోర్లతో ఊర్విల్ పటేల్ ఆకట్టుకున్నాడు. గజాన్ఫర్ స్పిన్కు ఊర్విల్ వికెట్ కోల్పోయాడు. రుతురాజ్తో జతకట్టిన కార్తీక్ శర్మ.. మూడో వికెట్కు అజేయంగా 98 పరుగులు జోడించాడు.
రుతురాజ్, కార్తీక్ శర్మలు అర్థ సెంచరీలతో ముంబయి ఇండియన్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సాధించాల్సిన రన్రేట్ ఒత్తిడి లేకపోవటంతో రుతురాజ్, కార్తీక్లు రిస్క్ తీసుకోకుండానే సూపర్కింగ్స్ను గెలుపు బాట పట్టించారు. మరో 11 బంతులు ఉండగానే సూపర్కింగ్స్ లాంఛనం ముగించింది. సీజన్లో 9 మ్యాచ్ల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఇది నాల్గో విజయం, ముంబయి ఇండియన్స్కు 9 మ్యాచ్ల్లో ఇది ఏడో పరాజయం. ఈ ఓటమితో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది.
నమన్ దిర్ ఒక్కడే :
చెపాక్లో తొలుత బ్యాటింగ్కు వచ్చిన ముంబయి ఇండియన్స్ ఆశించిన స్కోరు చేయలేదు. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ మరోసారి నిరాశపరిచింది. సూపర్కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ముంబయిని కట్టడి చేశారు. గత మ్యాచ్లో భారీ స్కోర్లు బాదిన ఓపెనర్లు విల్ జాక్స్ (1), రియాన్ రికెల్టన్ (37) చెపాక్లో తేలిపోయారు. రికెల్టన్ ఐదు సిక్సర్లతో ఎదురుదాడి చేసినా.. స్పిన్నర్ నూర్ అహ్మద్ మాయలో పడ్డాడు. నమన్ దిర్ (57, 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్థ సెంచరీతో ముంబయికి మంచి స్కోరు అందించాడు. సూర్యకుమార్ యాదవ్ (21), తిలక్ వర్మ (5), హార్దిక్ పాండ్య (18) తేలిపోయారు. హార్దిక్ పాండ్య 23 బంతుల్లో 18 పరుగులే చేయగా.. తిలక్ వర్మ 8 బంతుల్లో 5 పరుగులే చేశాడు. సూపర్కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ (3/32), నూర్ అహ్మద్ (2/26)లు వికెట్ల వేటలో రాణించారు. ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసంది.



