నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతర పోస్టర్ను శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో ఆ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జాతర ప్రాంగణంలో అవసరమైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సాయం అందించడానికి అంబులెన్స్లను సిద్ధం చేసుకోవడంతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార కల్తీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.