– బయటపడిన ఐరోపా ఇంధన బలహీనత : ఫైనాన్షియల్ టైమ్స్
న్యూయార్క్: గత మూడు నెలల్లో ఎన్నడూ లేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ఇందన ధరలు పెరగ టానికి కారణం ఎర్ర సముద్రం గుండా వాణిజ్య నౌకాయానం దుర్లభం కావటమే. దీనితో ఐరోపా ఆర్థిక వ్యవస్థల మీద ఒత్తిడి పెరుగుతోందని బుధ వారం ఫైనాన్షియల్ టైమ్స్ రాసింది. ఎర్ర సముద్రం లో పయనిస్తున్న వాణిజ్య నౌకల మీద యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు దాడులు చేయటంతో ఆసియా నుంచి చమురును ఐరోపాకు ఎగుమతి చేసే నౌకలు దక్షిణ ఆఫ్రికాను చుట్టి రావటం రవాణా వ్యయాన్ని విపరీతంగా పెంచుతున్నది. శుద్ది చేయబడిన చమురును అత్యధికంగా దిగు మతి చేసుకునే ప్రాంతాల్లో ఐరోపా ఒకటి. ప్రపంచంలో డీజిల్ ధరలను సూచించే గ్యాసాయిల్ ఫ్యూచర్స్ ఒక నెల రోజుల్లో 15శాతం పెరిగి అది మెట్రిక్ టన్నుకు 845డాలర్లకు చేరుకుందని ఫైనాన్షియల్ టైమ్స్ వాణిజ్య సమాచారాన్ని ఉటంకిస్తూ రాసింది. 2022లో రష్యా ముడి చమురుపైన, శుద్ది చేయబడిన చమురు ఉత్పత్తులపైన ఆంక్షలను విధించిన తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు ఆసియా, అమెరికాల నుంచి వచ్చే దిగుమతు లపైనే ఆధార పడుతున్నాయి. గాజాలో ఇజ్రాయిల్ పాల్పడుతున్న మానవ హననానికి నిరసనగా హౌతీ మిలిటెంట్లు చేస్తున్న దాడులతో ఎర్ర సముద్రంలో జరిగే రవాణాలో ఏర్పడిన సంక్షోభం కారణంగా నౌకలు దక్షిణ ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హౌప్ను చుట్టి వస్తున్నాయి. దీనితో రవాణా, భీమా చార్జీలు గణనీయంగా పెరుగుతున్నాయి.
మరోవైపు అమెరికాలో చమురు శుద్ది కర్మాగారా లలో నిర్వహణకు సంబంధించిన మరమ్మత్తులు జరుగుతుండటంతో అమెరికా నుంచి దిగిమతి అవుతున్న చమురులో కోత పడుతున్నది. దీనితో చమురు ధరలు పెరుగుతాయని నిష్ణాతులు హెచ్చరి స్తున్నారు. పర్యవసానంగా ఐరోపా దేశాలు సుయెజ్ కాలువకు తూర్పు నుంచి వచ్చే దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి స్థితిలో ఎర్ర సముద్రం గుండా జరిగే రవాణాలో ఏర్పడిన ప్రతిష్టంభన ప్రభావం ఐరోపా దేశాలపై తీవ్రంగా ఉంటుందని, దానివల్ల చమురు ధరలు పెరుగుతాయని ఎనర్జీ యాస్పెక్ట్స్ కంపెనీలో చమురు ఉత్పత్తుల ఎనలిస్టుగావున్న నటాలియా లొసాడా అన్నది. ఐరోపా దేశాలు సరుకు రవాణా లోను, విమాన ప్రయాణాలకు, గృహాల హీటింగ్ కొరకు డీజిల్ను విపరీతంగా వాడతాయి. డీజిల్ ధరలు పెరిగితే ఇప్పటికే విపరీతమైన వత్తిడిలో వున్న ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత వత్తిడికి లోనవుతాయి. గాజాలో యుద్ధం మొదలవ్వక ముందు యూరోపియన్ యూనియన్కు అవుతున్న మొత్తం చమురు సరఫరాలో మధ్య ప్రాచ్చం నుంచి దిగుమతి అయ్యే ఇందనం వాటా 60శాతం ఉండేది. అది ఇప్పుడు మూడవ వంతుకు పడిపోయిందని ఎస్ అండ్ పి గ్లోబల్ కమ్మోడిటీ ఇన్సైట్స్ డ్యాటాను బట్టి అర్థం అవుతోంది. ఎర్ర సముద్రంలో ఏర్పడిన సంక్షోభంతోపాటు అమ్స్టర్ డాం -రోటర్డాం-అన్ట్వర్ప్(ఏఆర్ఏ) నిల్వలు క్షీణించ టంతో ఐరోపా దేశాలలో చమురు సరఫరా మరింతగా దెబ్బతిన్నది.