కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి– ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ రోహిత్‌ చౌదరి : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఉప్పల శ్రీనివాస గుప్త
నవతెలంగాణ-నాగోల్‌
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చౌదరి అన్నారు. రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌, ఇంటర్నేషనల్‌ ఆర్యవైశ్య ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఉప్పల ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస గుప్త బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు ఆయన నాగోల్‌ డివిజన్‌లోని తన నివాసం నుంచి అభిమానులతో కలిసి ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మల్రెడ్డి రామిరెడ్డి, తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి కుమార్‌ రావుల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. శ్రీనివాస గుప్తకు రోహిత్‌ చౌదరి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్‌ చౌదరి మాట్లాడుతూ.. ఉప్పల శ్రీనివాస గుప్తకు కాంగ్రెస్‌ మంచి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు పరిచిన ఘనత ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్‌ స్థానాల్లో విజయకేతనం ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, కేంద్రంలో ఈ దఫా ఇందిరమ్మ పాలన రానున్నదని చెప్పారు. ఉప్పల శ్రీనివాస్‌ గుప్త మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పథకాల అమలు వల్లే కాంగ్రెస్‌లో చేరినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఆర్యవైశ్యులను ఏకం చేసి, వారికి మేలు చేసేలా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి విన్నవిస్తామని తెలిపారు. తెలంగాణ యూత్‌ వైశ్య ఫెడరేషన్‌ అధ్యక్షుడు కట్టా రవికుమార్‌, ఐవీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్‌, కటకం శ్రీనివాస్‌, నరేష్‌ గుప్తా, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు సాంబు పాండు గుప్తా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్‌, 33 జిల్లాల వైశ్య నాయకులు, ఉప్పల యువసేన నాయకులు, బీసీ, మైనార్టీ నాయకులు మహ్మద్‌, బాషా, ఆసీఫ్‌ సహా దాదాపు మూడు వందల మందికి పైగా కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మెన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు రామ్‌మోహన్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నాగోల్‌ డివిజన్‌ అధ్యక్షులు మంజులా రెడ్డి పాల్గొన్నారు.

Spread the love