పోడు భూములకు పట్టాల పంపిణీ

– జూన్‌ 24 నుంచి 30 వరకు…
– దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులకు ఇండ్ల స్థలాలు
– జులైైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం
– జులై 14న నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణ పనులకు శంకుస్థాపన : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజనులకు జూన్‌ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గ్రామాల్లో నివాసయోగ్య ప్రభుత్వ స్థలాలను గుర్తించి అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. జులైలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పలు కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి ఆర్థిక శాఖకు అందజేయాలనీ, వారికీ రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ద్వారా రైతుబంధు
పోడు భూములకు పట్టాల పంపిణీ పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో క్రోడికరించాలన్నారు. మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబంధు అందుతున్నదో వారికీ అలాగే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్‌ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమచేస్తుందని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.
ఇండ్ల స్థలాల పంపిణీ
ఆయా గ్రామాల్లో ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్ల నిర్మాణాల కోసం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వారికి పట్టాల పంపిణీ చేయాలని సూచించారు.
జులైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరితగతిన తయారు చేయాలనీ, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.
నిమ్స్‌ ఆస్పత్రి నూతన భవనానికి శంకుస్థాపన
వైద్య ఆరోగ్య దినోత్సవమైన జూన్‌ 14న నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. రెండువేల పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటి హాస్పిటల్‌ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

 

Spread the love