– సింగిల్ హ్యాండ్కి ఓటు వేయండి
– ఆర్ఆర్ఆర్ని గెలిపించండి : సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
నవతెలంగాణ-ఖమ్మం
”అమ్మా.. అక్క.. బాబూ.. తాతా.. చెల్లి.. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ ”గుర్తుం”దా..! అదేనండి మన హస్తం గుర్తు. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్కి ఓటు వేసి గెలిపించండి” అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ప్రచారం నిర్వహించారు. ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్, జెడ్పీసెంటర్, పాత కలెక్టరేట్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం రోడ్ షో నిర్వహించారు. మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి, అభ్యర్థి ఆర్ఆర్ఆర్ పాల్గొన్న ఈ రోడ్ షోలో ప్రసంగించారు. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు.. ఈ రఘురాముడికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అన్నారు. అందరికీ ”గుర్తుం”ది…! కదా… ఈనెల 13..! ఆ రోజు ఈవీఎంలో మూడో నెంబర్ హస్తం గుర్తుకు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత… మన హక్కు…. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఎనీ టైం… ఎనీ సెంటర్ అంటూ సందడి
ఎనీ టైం .. ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ రఘురాముడు.. ఖమ్మం.. ఖమ్మం.. ఖమ్మం.. కమాన్ అంటూ సినీ హీరో వెంకీ నగరంలో సందడి చేశారు. ఖమ్మం ప్రజానీకం వెంకటేష్ను చూసేందుకు ఉత్సాహం చూపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ రోడ్ షోకు నీరా’జనం’ పలికారు. అభివాదం చేస్తూ.. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆర్ఆర్ఆర్ను గెలిపించాలని కోరుతూ ఆయన ముందుకు సాగారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రం, నాయకులు నవీన్ రెడ్డి, బషీర్, భుక్యా శ్రీను, తిరుపతిరావు, బి.సుదర్శన్, కాంగ్రెస్ జిల్లా నగర అధ్యక్షులు దుర్గాప్రసాద్, జావిద్, మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్, కార్పొరేటర్ కమర్తపు మురళి, బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకులు జానీమియా, పోటు కళావతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.