– కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ల ఒత్తిడి
– ఏఐసీసీకి కత్తిమీద సాములా ఎంపిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక గుమ్మనంగా సాగుతున్నది.ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నుంచి తమ వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకుపోతున్నారు.
దీంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక పార్టీకి కత్తిమీద సాములా తయారైంది. జనవరి చివరివారంలో ఎంపీ అభ్యర్థుల కోసం పార్టీ నేతల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు 800లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి కొన్ని పేర్లను అధిష్టానానికి పంపింది. కానీ ఎలాంటి హడావుడి లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డిని ప్రకటించడంతో అభ్యర్థుల ఎంపిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ సీనియర్లు తమ వారసులకు, కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో పోటీ కూడా ఎక్కువగానే ఉన్నది. ఇప్పటికే అనేకులు ఎంపీ టికెట్ ఆశించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. మరికొంత మంది వ్యాపారవేత్తలు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉండనే ఉన్నారు. తమకు కాదంటే తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
అందులో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కె. జానారెడ్డి తమ వారసుని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయన కుమారుడు రఘువీర్రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ స్థానిక పరిస్థితుల రీత్యా వీలు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వారసుల పోటు ఎక్కువైంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాదరెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఆ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. మెదక్ నియోజకవర్గం నుంచి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ మైనంపల్లి హన్మంతరావు అడుగుతున్నారు.
అదే టికెట్ను తన కూతురు త్రిషలకు ఇప్పించుకునేందుకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. తన భార్య నిర్మలాగౌడ్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు. భార్యకు కాదంటే, తన కూతురుకు ఇవ్వాలని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నుంచి తన కుమారుడు గడ్డం వంశీకి టికెట్టు ఇప్పించుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ బీఫామ్ పొందారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కుమారుడికి టికెట్ ఆశిస్తున్నారు.
భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భార్యకు ఎంపీ టికెట్ లేదా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. చెవెళ్ల పార్లమెంటు నుంచి పట్నం మహేందర్రెడ్డి భార్య రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు ఆమెను పార్టీలో చేర్పించినట్టు ఆ వర్గాలు అంటున్నాయి.
‘వారసులు’పై పార్టీ భిన్నాభిప్రాయాలు
కాంగ్రెస్ పార్టీలో వారసులకు టికెట్లు అన్న చర్చపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల అండతో రాజకీయంగా ఎదిగిన సీనియర్ నేతల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పోస్టర్లు వేయడానికి, జనసమీకరణ చేయడానికి, ప్రతి విషయంలో అండగా ఉన్న తమను కాదని వారసుల కోసం పాకులాడటం సరైందికాదని చెబుతున్నారు. కార్యకర్తలను కాదని తమ కుటుంబ ప్యాకేజీ కోసం తాపత్రాయ పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతల ఎదుగుదల కోసం కృషిచేసిన వారి పదవులు కావాలని మాత్రం అడగకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ వారసులకు ఇచ్చిన ప్రాధాన్యతను తప్పుపట్టిన కాంగ్రెస్…అదే దారిలో నడుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.