పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి

Armed electoral conduct rule of thumb– సీఎస్‌ శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్‌, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడుతూ, సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కరానటక, ఆంధ్ర ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు., ఆయా రాష్ట్రాల అధికారులతో కలసి పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.
పోలీస్‌ శాఖ పరిధిలో 444 చెక్‌ పోస్టులుండగా, 9 అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులున్నాయని సీఎస్‌ తెలిపారు. ఇప్పటివరకు పోలీస్‌ శాఖ ద్వారా రూ.పది కోట్లు స్వాధీన పర్చుకోవడంతోపాటు లైసెన్స్‌ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, బంగారాన్ని కూడా స్వాదీనం చేసుకున్నట్టు వెల్లడించారు. రవాణా శాఖ ద్వారా 15 చెక్‌ పోస్టులు, 52 ఎన్ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ చెక్‌ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని తెలిపారు. రవాణా శాఖ బృందాలు జరిపిన తనిఖీల్లో రూ. 34.31 లక్షలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 16 అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయడం తోపాటు 31 స్ట్రాటెజిక్‌ పాయింట్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. వీటితోపాటు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, వివిధ వస్తువులను పంచేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ గోదాములపై కూడా నిఘా పెట్టినట్టు తెలిపారు.
ఎక్సైజ్‌ శాఖ ద్వారా 21 అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులు, ఆరు మొబైల్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న ఎనిమిది జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సీఎస్‌ తెలిపారు. మద్యం అక్రమ రావాణా కు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి వాటి నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీన పరుచుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీలపై ప్రత్యేక నిఘా ఉంచామనీ, సీసీటీవీలను ఏర్పాటు చేసి డిస్టిలరీస్‌ ద్వారా మద్యం సరఫరాను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో పోలీస్‌ శాఖకు చెందిన పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి కూడా మద్యం రవాణాపై సీసీటీవీల ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించినట్టు తెలిపారు. అటవీ శాఖ ద్వారా కూడా 65 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయగా…. ఇందులో 18 అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులునున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని పటిష్టంగా అమలుచేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శాంతి కుమారి చెప్పారు.సమీక్షా సమావేశంలో డీజీపీ రవీ గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, పీసీసీఎఫ్‌ దొబ్రియల్‌, హౌమ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, అడిషనల్‌ డీజీ ఎస్‌.కె. జైన్‌, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్‌ టీ.కె. శ్రీదేవి, ఎక్సయిజ్‌ శాఖ కమీషనర్‌ శ్రీధర్‌, సమాచార పారసంబందాల శాఖ స్పెషల్‌ కమీషనర్‌ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love