గృహలక్ష్మి గడువును పెంచి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పెంచాలి

– సీపీఐ(ఎం) నాయకుల డిమాండ్

నవతెలంగాణ-కంఠేశ్వర్
గృహలక్ష్మి గడువును పెంచి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పెంచాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఏవో ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మూడు రోజుల గడువు నిర్ణయం చేసి లబ్ధిదారులు ఆన్లైన్లో అప్లై చేయాలని నిర్ణయించటంతో అనేకమంది అర్హులైన లబ్ధిదారులు కావలసిన సర్టిఫికెట్లు అందక ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి గడువు సరిపోక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని కావున ప్రభుత్వం నెలరోజుల పాటు గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవటానికి సమయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గత నాలుగైదు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండటంతో తలుపులు, దర్వాజాలు కిటికీలు దొంగలించడం జరుగుతుందని అద్దాలు పగిలిపోయాయని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని ఆయన అన్నారు. అందువల్ల వాటిని వెంటనే సరిచేసి అర్హులైన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో పాటు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోవడంతో అనేకమంది నిరుపేదలు కిరాయి భరించలేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం కొనసాగిస్తున్నారని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలందరికీ ఇండ్ల పట్టాలను జీవో నెంబర్ 58 ప్రకారం వెంటనే ఇవ్వాలని అదేవిధంగా గతంలో ఇంటి పట్టాలు ఇచ్చి ఇప్పుడు మాత్రం వారికి స్థలం కబ్జాదారుల కింద ఇంటి టాక్స్ ను వసూలు చేయడం సరైంది కాదని వారందరికీ ఇంటి యజమానులుగా నిర్ణయించి ఇంటి పన్నులను వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పై సమస్యలను పరిష్కరించాలని లేనియెడల లబ్ధిదారులతో ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు నగర నాయకులు దేరంగుల కృష్ణ, మరియు సందీప్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love