ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం: మేడిపల్లి సత్యం

నవతెలంగాణ- గంగాధర: భారీ వర్షాల ప్రభావంతో చొప్పదండి నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. సత్యం ఆధ్వర్యంలో  గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్-జగిత్యాల  జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భారీ వర్షాలకు చొప్పదండి నియోజక వర్గంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిని  ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వరద నీటితో పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి  రైతులు వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వర్షాలు పడి పదిహేను రోజులు గడిచిన  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక్క కల్వర్టును, ఒక్క రోడ్డును  పరిశీలించిన పాపాన పోలేదన్నారు. వర్షాలకు నష్టపోయిన ఏ ఒక్క రైతును ఎమ్మెల్యే పరామర్శించి భరోసా కల్పించిన దాఖలాలు లేవన్నారు. నియోజక వర్గంలోని ప్రజలు ఇబ్బంది పడుతున్న  ఇక్కడి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. అధికారులతో తూతూ మంత్రంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడమే తప్ప, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడం లేదన్నారు. చొప్పదండి నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో ధ్వంసమైన రోడ్లను, కల్వర్టులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్  క్షేత్ర స్థాయిలో రోడ్లను పరిశీలించి మరమ్మత్తులు ఎప్పుడు చేస్తారో తేల్చి చెప్పాలన్నారు. నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా పరిహారం అందజేస్తారో చెప్పాలన్నారు. నియోజక వర్గంలోని రోడ్లను పూర్తి స్థాయిలో మరమత్తులు చేసే వరకు  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర,  రామడుగు, చొప్పదండి, బోయినిపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బొమ్మవేణి తిరుపతి, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి,  ఆనందరెడ్డి, చెలివేరి నారాయణ, వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, ఆదిరెడ్డి, పురం రాజేశం, రామిడి రాజిరెడ్డి, జవ్వాజి హరీష్, కోల రమేష్, బూర్గు గంగన్న, పంజాల శ్రీనివాస్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాడే శంకర్, ఏనుగుల కనకయ్య, రమేష్ , కడారి మల్లేశం, తోట సంధ్య కరణాకర్, చిప్ప లావణ్య-చక్రపాణి, పెరమళ్ళ గంగన్న, ముత్యం శంకర్, గడ్డం జీవన్ రెడ్డి, వొడ్నాల యగ్నేష్, నేరేల్ల సతీష్ రెడ్డి, సహు ఉదయ్, గాజుల అజయ్, వినోద్ రెడ్డి, మారుతి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love