ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ: రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ – నారాయణపేట: ‘పాలమూరు బిడ్డను… రైతుబిడ్డను… పేదింటి బిడ్డను… అలాంటి నేను ముఖ్యమంత్రిని అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? ఎప్పుడూ దొరల బిడ్డనే ముఖ్యమంత్రి కావాలా? ఆ తర్వాత మనవడు కావాలా? పాలమూరు బిడ్డ మాత్రం కావొద్దా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? కాగితాలపై సంతకం చేసే సత్తా మాకు లేదా?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో దొరలకు టిక్కెట్లు ఇవ్వలేదని… అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పేదలు, బీసీ కులాలకు టిక్కెట్లు ఇచ్చామన్నారు.
మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చాం
అధికారంలో ఉన్నప్పుడు మాదిగలకు అన్యాయం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. మాదిగలకు తమ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. వర్గీకరణకు పార్టీని ఒప్పించి బిల్లు పెట్టించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంద కృష్ణ మాదిగను అన్యాయంగా అరెస్ట్ చేస్తే గళమెత్తింది తానే అన్నారు.  మక్తల్ నియోజకవర్గంలో ముదిరాజ్ బిడ్డకు టిక్కెట్ ఇచ్చి మనం గెలిపించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా పది శాతం ఉందని, కానీ వారికి కేసీఆర్ ఒక్క టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో 14 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తామన్నారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ సీకి మార్చాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలన్నారు. బంగ్లా రాజకీయాలను కుర్మ, యాదవులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యాదవ బిడ్డ అనిల్‌కు తాము రాజ్యసభ ఇచ్చి గౌరవించామన్నారు.
బీఆర్ఎస్‌తో డీకే అరుణ కుమ్మక్కయ్యారని ఆరోపణ
నారాయణపేట ప్రజలు ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురు చూస్తున్నారని, కానీ ఈ ప్రాంతం నుంచి గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడూ రైలు కోసం కేసీఆర్‌ను అడగలేదని మండిపడ్డారు. ఇక్కడి బీజేపీ నేతలు కూడా ఇదే రైలు కోసం ప్రధాని మోదీని ఎప్పుడూ కలవలేదన్నారు. పాలమూరు – రంగారెడ్డికి ఒక్క పైసా అయినా డీకే అరుణ తెచ్చారా? అని ప్రశ్నించారు. డీకే అరుణ బీఆర్ఎస్‌తో కుమ్మక్కై రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. రూ.600 ఉన్న సిలిండర్‌ను మోదీ రూ.1200కు పెంచారని ఆరోపించారు. పదేళ్ల మోదీ పాలనలో పాలమూరు ఎండిపోయిందన్నారు.
మంత్రులు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు
ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మాత్రం వదలలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దొరలకు, పెత్తందార్లకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు. పేదలకు, బీసీ కులాల వారికి అధిక ప్రాధాన్యతను ఇచ్చామన్నారు.  ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడపడుచులు ఉచిత బస్సుల్లో ప్రయాణించారన్నారు. వంద రోజుల్లో ఎన్నో హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు. 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మన మంత్రులు రోజుకు 18 గంటలు పని చేస్తూ కష్టపడుతున్నారన్నారు. కేసీఆర్ వందేళ్ల నాశనం చేస్తే తాము రాత్రింబవళ్లు కష్టపడి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు బీఆర్ఎస్‌కు ఓటేశారని, ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ వేయాలనుకుంటున్నారని ఆరోపించారు. రెండు పార్టీలు చీకటి ఒప్పందం పెట్టుకున్నాయన్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, జహీరాబాద్, భువనగిరి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ డమ్మీ కార్యకర్తలను పెట్టి బీజేపీకి సహకరిస్తున్నారన్నారు. తన కూతురు కవితను జైలు నుంచి విడిపించేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్నిమోదీ వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. మోదీ వద్ద బీఆర్ఎస్‌ను ఎందుకు తాకట్టు పెట్టారో ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఐదు నియోజకవర్గాల్లో బీజేపీకి ఓటు వేయాలని కేసీఆర్ చెబుతున్నారన్నారు.
ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ: రేవంత్‌ రెడ్డి
‘‘ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులివ్వాలి. వారికి న్యాయం చేసేందుకే బీసీ కులగణనకు తీర్మానం చేశాం. భారాస ప్రభుత్వం పదేళ్లపాటు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. కేసీఆర్‌ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు. పాలమూరు బిడ్డ, పేదోడి బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేకపోతున్నారు. దొరలు మాత్రమే కుర్చీల్లో కూర్చోవాలా? పేద బిడ్డలు కూర్చోవద్దా? కేసీఆర్‌.. తర్వాత ఆయన కుమారుడు మాత్రమే సీఎం కావాలా? జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు భారాస పార్టీని మోదీకి తాకట్టుపెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద ఉంచారు. భారాస ఓట్లన్నీ భాజపాకి మళ్లించాలని కేసీఆర్‌ చెబుతున్నారు. వందరోజులకే నన్ను గద్దె దించాలని కేసీఆర్‌ అంటున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీని గద్దె దించాలని ఎందుకు అనడం లేదు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల మేర రైతు రుణమాఫీ చేస్తాం’’ అని రేవంత్ అన్నారు.

Spread the love