తెలంగాణలో కుల గణన.. సీఎం సంచలన నిర్ణయం..!

నవతెలంగాణ – హైదరాబాద్: త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై శనివారం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు. మహాత్మా జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్‌ను మరింత సమర్థం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్‌ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని చెప్పారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్‌లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్‌లో మరో పట్టణం, లేదంటే మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలన్నారు.

Spread the love