తాటిచెట్టుపై నుండి పడి గీతకార్మికుడికి గాయాలు

నవతెలంగాణ-వీణవంక
తాటిచెట్టుపై నుండి ఓ గీత కార్మికుడు జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉయ్యాల ఎల్లయ్య (38) రోజువారిగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో అతడు చెట్టుపై నుండి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు అతడిని హుటాహుటిని జమ్మికుంటకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించినట్లు బంధువులు తెలిపారు. కాగా బాధితుడు ఎల్లయ్య సోదరుడు చందర్ పక్షం రోజుల క్రితం ఇదే తరహాలో చెట్టుపై నుండి పడడంతో మృతి చెందాడు. మళ్లీ ఇదే ఘటన జరుగడంతో ఆకుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర ఆవేదనకు గురవుతోంది.

Spread the love