ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన పట్ల సానుభూతి చూపించేవారు ఉన్నారు. విమర్శించేవాళ్లూ ఉన్నారు. సానుభూతి చూపించేవారి వాదన మాత్రం.. ఈ వయసులో ఆయన పట్ల జగన్ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? ఆయనో సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి నిర్మాత, స్వర్ణాంధ్ర సాధకుడు. అలాంటి మహానేతపై జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ప్రతిరోజూ ఏదో ఓచోట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా బయటకు రావాలంటూ కొంత మంది అభిమానులు పూజలు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు మాత్రం చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆయన కోసం సొంత పార్టీలోళ్లు నిర సనలు తెలపవచ్చు, ఖండించనూవచ్చు. కానీ ఇక్కడ వింత ఏంటంటే, టీడీపీ మాజీ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు…చంద్రబాబు జైల్లో ఉంటే తెగబాధపడిపోతున్నారు. ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి ఆవేదన చెందారు. ఆదివారం దీక్ష చేస్తానని ప్రకటించారు. మోత్కుపల్లి తీరు ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది. చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ ఖండించి వదిలేసింది. కానీ ఆ పార్టీకి చెందిన మోత్కుపల్లి మాత్రం దీక్ష చేస్తానడంతో ఆయన దారి ఎటువైపు? అంటూ సోషల్మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తిరిగిన ఆయన…స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నప్పటికీ బాబు కోసం పడే తపన చూస్తే ఆయన క్రాస్రోడ్లో ‘కారు’ దిగి ‘సైకిల్’ ఎక్కుతారా ఏంది? అనే చర్చ నడుస్తోంది… – గుడిగ రఘు