నాది పేద కుటుంబమే.. ఎంతో కష్టపడి చదివా

– గురి పెట్టి చదివితేనే లక్ష్యం సాధ్యం
– పత్రికల ద్వారా సగానికి పైగా విజయం
– అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
నాది పేద కుటుంబమే.. కష్టాలంటే ఏంటో తెలుసు.. అవి చూసి తల్లిదండ్రులు పడే బాధ తెలుసు.. అందుకే కష్టపడి చదివి నేడు జిల్లా అదనపు కలెక్టర్‌ స్థాయికి వచ్చాను. మీరు నాలాంటి పేద పిల్లలే గురిపెట్టి చదివి లక్ష్యాన్ని సాధించి కన్నవారి కలలు సహకారం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఏ. భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్‌ విజ్ఞాన కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షల కోసం చదువుతున్న అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను హాస్టల్‌లో ఉండి ఎంతో కష్టపడి చదివానని ప్రతి ఒక్కరు మూస పద్ధతిలో కాకుండా శ్రద్ధతో చదవాలన్నారు. ప్రతి ఒక్కరికి తెలివి ఉంటుందని, దానిని గుర్తించి నిరంతరాయంగా చదవాలని, చదివేప్పుడు ఇతరులతో పోటీ తగదని నాకు నేనే పోటీ అనే భావనతో చదవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి ఒక షెల్టర్‌ కావాలని ఆ అవకాశాన్ని ఎంవీఎన్‌ విజ్ఞాన కేంద్రం అందిస్తుందని, షెల్టర్‌ అందివ్వడమే కాకుండా పేద విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ఉచితంగా అందిస్తుందని ఈ సందర్భంగా ఎంవీఎన్‌ విజ్ఞాన కేంద్ర నిర్వాహకులను ప్రశంసించారు. జీవితంలో ఎవరు ఓడిపోరని ఎక్కడో అక్కడ స్థిరపడతారని పేర్కొన్నారు. ఎన్ని పనులు చేసిన అంతిమ లక్ష్యంగా గౌరవపద ఉద్యోగం పొందాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశం అన్నారు. నేటి విద్యార్థులు చదవడం కంటే వినటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని అలా కాకుండా చదివి ఆ వెంటనే నోట్స్‌ రాయాలని సూచించారు. ముఖ్యంగా ప్రతిరోజు పత్రికలో చదవడం అలవర్చుకోవాలని, పత్రికలు చదవడం ద్వారా సగానికిపైగా లక్ష్యాన్ని సాధించినట్లే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ట్రస్ట్‌ కార్య నిర్వాహక కార్యదర్శి పి. నర్సిరెడ్డి, కన్వీనర్‌ అక్కెనపల్లి మీనయ్య, తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, సయ్యద్‌ హశం, బండ శ్రీశైలం, ప్రభావతి, పొట్టబత్తిని యాదగిరి, పాలడుగు నరేష్‌, పెరిక శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love