కష్టమే..

It's difficult..– ప్రజా సమస్యలు ముందుకు.. వెనక్కి పోయిన హిందూత్వ
– కాలం చెల్లిన మెజారిటీవాద రాజకీయాలు
– మసకబారుతున్న మోడీ ప్రాభవం
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ ముగిసింది. మరో నాలుగు విడతల పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఎన్డీఏ నేతలు కలలు కంటున్నట్లు 400కు పైగా స్థానాలు వచ్చే అవకాశాలు ఏ కోశానా కన్పించడం లేదు. మోడీ మానియా క్రమేపీ అదృశ్యమవుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మోడీ ఛరిష్మాకు కాలం చెల్లిందని రాజకీయ పండితులు తేల్చేశారు.
న్యూఢిల్లీ : బీజేపీ, దాని మిత్రపక్షాలకు 400కు పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయని మోడీ గతంలో చెప్పే వారు. 2014, 2019 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం స్పష్టంగా కన్పించింది. అయితే ఇప్పుడది ఎక్కడా కానరావడం లేదు. ఓటర్లను ప్రభావితం చేసే ఏకైక అంశం కూడా ఏదీ లేదు. తాను అన్నింటికీ అతీతుడినని మోడీ భావిస్తారు. తనకు ఎదురే లేదని అనుకుంటారు. దేశాన్ని అమృతకాలంలోకి నడిపిస్తానని చెబుతారు. హిందూ మత పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా అసంపూర్తిగా నిర్మితమైన రామమందిరాన్ని అయోధ్యలో అట్టహాసంగా ప్రారంభించారు. తను ఏం చేసినా ప్రజల మద్దతు ఉంటుందని విశ్వసిస్తారు. బీజేపీ కూడా తదుపరి ప్రధాని మోడీయేననే ధీమాతో ఉంది. ‘మోడీకీ గ్యారంటీ’ పేరుతో ప్రధాని ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఉచితంగా ఆహారం, గృహవసతి, వంటగ్యాస్‌, కుళాయి నీరు వంటివి వాటిలో కొన్ని. అయితే క్రమంగా మోడీ, ఇతర బీజేపీ నేతల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతోంది. రెండో దశ పోలింగ్‌ ప్రచారం సందర్భంగా ప్రధానిలో అసహనం కన్పించింది. ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నారు. మైనారిటీలకు కాంగ్రెస్‌ కొమ్ము కాస్తోందని, హిందువుల సంపదను గుంజుకొని వారికి ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఓటర్ల మనోగతాన్ని పసిగట్టేందుకు పలువురు విశ్లేషకులు హిందీ రాష్ట్రాల్లో పర్యటించారు. 2019తో పోలిస్తే బీజేపీ బలం తగ్గుతుందని వారు తేల్చి చెప్పారు. 2019లో హిందీ బెల్ట్‌లో బీజేపీ గరిష్ట సంఖ్యలో స్థానాలు సాధించింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో మెజారిటీవాద రాజకీయాలు నడిపి ఓట్లు దండుకుంది. అయితే ఇప్పుడు ఆ వాతావరణం కన్పించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో మోడీ ప్రాభవం ఇప్పుడు మసకబారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రజా సమస్యలు ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిందూత్వ వాదం వెనక్కి పోయింది. మోడీకి కంచుకోటలుగా ఉన్న హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు కోల్పోతుందో చూడాల్సి ఉన్నదని రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మెజారిటీకి అవసరమైన 272 స్థానాలు గెలుచుకోవడం కూడా మోడీకి సవాలేనని ఆయన తెలిపారు.
తప్పుడు వాదనలు
ప్రధాని బీజేపీ బహిరంగ సభల్లో తప్పుడు వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. మే 1న గుజరాత్‌లోని బనస్కాంతలో నిర్వహించిన బహిరంగ సభలో .. ”ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 272 సీట్లు గెలవడం అవసరం. బీజేపీ తప్ప మిగిలిన దేశంలోని ఏ రాజకీయ పార్టీ 272 స్థానాల్లో పోటీ చేయడం లేదు. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు.” అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు 327 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.

Spread the love