జైస్వాల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

– ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ద్విశతకాలతో చెలరేగుతున్న యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌.. టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా టెస్ట్‌ బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్‌, రాజ్‌కోట్‌ టెస్టుల్లో డబుల్‌ సెంచరీలతో మెరిసిన జైస్వాల్‌.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 14వ స్థానాలు మెరుగుపరుచుకొని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. రాజ్‌కోట్‌ టెస్టుకు ముందు 29వ ర్యాంకులో ఉన్నాడు. జైస్వాల్‌ 699 పాయింట్లతో ఈ ర్యాంకుకు చేరాడు. కాగా ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీ ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. కోహ్లీ 752 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ ఒక స్థానం ఎగబాకి 12వ ర్యాంకులో ఉన్నాడు. ఈ జాబితాలో కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌) అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా.. అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా రాజ్‌కోట్‌ టెస్టులో 500వ వికెట్‌ తీసిన రవిచంద్రన్‌ అశ్విన్‌.. రెండో స్థానానికి చేరాడు. రవీంద్ర జడేజా 3 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకుకు చేరాడు.

Spread the love