నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతోంది. త్వరలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవలంబించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు బీఎల్ సంతోష్, బండి సంజయ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, ఈటల సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న జేపీ నడ్డా.. పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. బీజేపీలో అసంతృప్త నేతలను బుజ్జగించే పూర్తి బాధ్యతలను ఈటల రాజేందర్కు అప్పగించారు. సమావేశం కోసం రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.