– దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
– మేడే దినోత్సవం ఘనంగా జరుపుకుందాం
నవతెలంగాణ-నిజాంపేట
138వ మేడే దినోత్సవం ఘనంగా జరుపు కోవాలని 29 కార్మిక చట్టాల పునరుద్ధరణకై బీజేపీని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాలని ఏఐటీయూసీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయ్యవారి లక్ష్మణ్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాప్ వద్ద కరపత్రాన్ని విడుదల చేస్తూ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో పౌర ప్రజాస్వామ్య పాలన అంతమైందని పెట్టుబడిదారీ విధానం కొనసాగుతున్నదన్నారు. కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోడ్లు తెచ్చిందన్నారు. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వము 3 రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ బిల్లులను బలవంతంగా రైతులపై ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. లేబర్ కోడులను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు 600 చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాలా గౌడ్, తిరునాహరి శ్రీనివాస్, ఏసు ప్రవీణ్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.