చంద్రునిపై కూలిన ‘లూనా-25’

– చివరి మజిలీలో విఫలమైనట్టు ప్రకటించిన రష్యా
మాస్కో : సుమారు 47 ఏండ్ల తర్వాత రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మూన్‌ మిషన్‌ లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ ఆదివారం తెలిపింది. శనివారం మధ్యాహ్నం 2.57 గంటలకు లూనా-25 కమ్యూనికేషన్‌ కోల్పోయిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ల్యాండర్‌ చంద్రుని ఉపరితలాన్ని ఢకొీన్న తర్వాత ఉనికిలో లేదని తెలిపింది. అంతరిక్ష నౌకను గుర్తించి, కమ్యూనికేట్‌ చేసేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో తీసుకున్న చర్యలు విఫలమయ్యాయని వివరించింది. రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ఈ నెల 11న ‘లూనా-25’ని ప్రయోగించింది. పదిరోజులపాటు ప్రయాణించిన ల్యాండర్‌ కొన్ని గంటల క్రితమే చంద్రుడి ఫొటోలను పంపించింది. ఈ నెల 21న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ కావాల్సి ఉంది. అందుకోసం కక్ష్య (ప్రీ ల్యాండింగ్‌ ఆర్బిట్‌)కు చేరడానికి కీలక విన్యాసం చేపట్టే ప్రయత్నంలో లూనా-25లోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రోస్‌కాస్మోస్‌ గుర్తించింది. అప్పటికే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తెలిపింది.

Spread the love