– అథ్లెటిక్స్ స్టేట్ మీట్లో శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ : యువత ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అసమాన ప్రోత్సాహం అందిస్తుంది. వనరులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని మన రాష్ట్రం నుంచే మిల్కాసింగ్, పి.టి ఉషలు తయారు కావాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని గోల్కోండ కోట ‘ఆర్టిలరి సెంటర్ స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్ర అథ్లెటిక్స్ మిడిల్, లాండ్ డిస్టాన్స్ మీట్కు ఆంజనేయ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్రం నుంచి మిల్కాసింగ్, పిటి ఉషలను వెలికి తీయటమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. దశాబ్ది కాలంలో క్రీడా రంగంలో ఎంతో పురోగతి సాధించాం. నిఖత్ జరీన్, హుసాముద్దీన్, ఇషా సింగ్, నందని వంటి యువ అథ్లెట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి చాటుతున్నారని’ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా పరుగు పోటీల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో సారు కోచ్ నాగపురి రమేశ్, ఓయూ ప్రొఫెసర్ రాజేశ్, రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.