బీజేపీ, బీఆర్ఎస్ లను చిత్తుగా ఓడించాలి: మంత్రి శ్రీధర్ బాబు

– కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి సీపీఐ(ఎం) పార్టీ మద్దతు
– రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య తో కలిసి మంథని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇండియా కూటమిలో భాగంగా సీపీఐ(ఎం) పార్టీ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడాన్ని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశికి గెలుపు కోసం సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సీపీఐ(ఎం) పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై. యాకయ్య మాట్లాడారు. మతతత్వ బీజేపీ పార్టీని ఓడించడానికి ఇండియా కూటమిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సీపీఐ(ఎం) మద్దతిస్తుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులం,మతం ప్రాంతం, దేవుడి పేరుతో  రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల మధ్యన అనైక్యతను సృష్టిస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వలన భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ నాయకులు అధికారంలోకి వస్తే  రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారని అన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించినటువంటి మేధావులను ఉద్యమకారుల, ప్రొఫెసర్ల పై ఉప చట్టాలు ఉపయోగించి జైల్లో పెడుతుందని బీజేపీపై మండిపడ్డారు. మతతత్వ బీజేపీ పార్టీని ఓడించి గడ్డం వంశీని గెలిపించడానికి సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీలు జిల్లా కార్య వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు, ఏ. మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల కుమారస్వామి, బూడిద గణేష్, నాయకులు ఆర్ల సందీప్, వేల్పుల సురేష్, గొర్రెoకల సురేష్, ఇరుగురాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love