నవతెలంగాణ-యాచారం
ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డిని మంగళవారం ఆయన చాంబర్లో జీవో: 317 బాధిత ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికత అంశంపై తమకు న్యాయం చేయాలని బాధిత ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం జరిగేలా శాసనమండలిలో జీవో నెంబర్ 317పై ప్రస్తావించాలని కోరారు. అనంతరం బాధితులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గౌడ్ను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చి మా జీవితాల్లో మట్టిని కొట్టిందని విమర్శించారు. ఉపాధ్యాయుల డ్యూటీ విషయంలో స్థానికత అంశంపై తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ జీవోను రద్దుచేసి తమను సొంత జిల్లాలో పనిచేసే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఆర్థిక కార్యదర్శి చక్రపాణి, అసోసియేటివ్ ప్రెసిడెంట్ అచ్చన మల్లేశం, ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.