అడుగు జారుతున్న మోడీ అగచాట్లు

తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిన బీజేపీ బలం పరిమితమే గనక ఎన్ని ఎత్తుగడలు పన్నినా అధికారంలోకి రావడం గాని, దేశవ్యాపితంగా బలాబలాల మార్పులో గాని పెద్ద ప్రబావం ఉండదు. హిందీ రాష్ట్రాలు మరీ ముఖ్యంగా యూపీ, గుజరాత్‌ వంటి చోట్ల బీజేపీని నిలవరించడం కీలక కర్తవ్యమవుతుంది. బీజేపీ, ఆరెస్సెస్‌ కూటమి తమ బలహీనతను గుర్తించిందని వారి కదలికలు చెబుతున్నాయి. మరి కాంగ్రెస్‌, ఇతర లౌకిక ప్రాంతీయ పార్టీలు కూడా పైన చెప్పుకున్నట్టు అవగాహన పెంచుకుని అడ్డుకునే దిశలో సాగుతాయా అన్నదే భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
     తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కోణాన్ని అలావుంచితే దేశవ్యాపితంగా బీజేపీనూతన వ్యూహాన్ని తీసుకుందని చెప్పే ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. మూడో సారి కూడా తన్నుకుంటూ వచ్చేస్తామని పైకి చెబుతున్నా తాము నమ్ముకున్న బ్రాండ్‌ మోడీ పలచబడిపోయిందనీ, ఓట్లను రాబట్టే శక్తి చాలడం లేదని, సంఫ్‌ పరివార్‌ గ్రహించిన కారణంగానే ఈ కొత్త హడావుడి అంటున్నారు. ఆరెస్సెస్‌ అధికార పత్రికలోనే ఈ విషయం పరోక్షంగా అంగీకరించారు. మోడీ జనాకర్షణ హిందూత్వ భావజాలం మాత్రమే అధికారం తెచ్చిపెడతాయనుకుంటే పొరబాటని ఆ పత్రిక పేర్కొంది.
మే 28వ తేదీన అంగరంగ వైభవంగా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించారు. అయితే ఆ వెనువెంటనే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ పిలిపించి ఉపన్యాసం ఇచ్చి పంపారు. కాకుంటే లోక్‌సభ ఎన్నికలు రానుండగా జరిగిన ఈ సమావేశంలో ఆయన యుద్ధానికి దూసుకుపోదామని పిలుపిస్తారను కుంటే ఆ ఉపన్యాస పాఠం మారింది. మీ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో మంచి సంబంధాలు పాటించేలా జాగ్రత్తపడాలని ఉపదేశించారు. వారు ప్రాంతీయ సమస్యల విషయంలో వారి భావాలకు బీజేపీ కూడా అండగా ఉంటుందనే సంకేతం వెళ్లాలన్నారు. వాస్తవానికి పార్లమెంటు భవన ప్రారంభ సభలో మోడీ స్వయంగా తానే మాజీ ప్రధాని జేడీఎస్‌ అధినేత దేవగౌడను అత్యంత ఆప్యాయంగా పలకరించారు. అత్యధిక ప్రతిపక్షాలు బహిష్కరించిన ఈ కార్యక్రమానికి దేవగౌడతో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ ఎంపీలు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇదంతా వూరికే పోలేదని గమనించాలి. కర్నాటకకు తిరిగివెళ్లిన దేవగౌడ బీజేపీ ఏమీ అంటరాని పార్టీ కాదని ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దానితో పొత్తు పెట్టుకోవడం గురించి ఆలోచించవచ్చునన్నారు. ఇక ఏపీకి ఎంతో కాలంగా శూన్యహస్తం చూపిస్తున్న కేంద్రం హఠాత్తుగా రెవెన్యూలోటు కింద రూ.10వేల కోట్లు విడుదల చేసింది. ఇంతకాలం నిరాకరించిన అన్యాయాన్ని ప్రశ్నించేబదులు ఇది వైసీపీ లొంగిపోయిన ఫలితమేనని టీడీపీ విమర్శించింది. మోడీ, అమిత్‌ షాలను జగన్‌ పలుసార్లు కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. కాని మరో రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా తానే వెళ్లి కలసి వచ్చారు. ఇది వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసమని కథనాలు వస్తే ఇరుపక్షాలూ మౌనం పాటిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45మీటర్లు కాగా 41.5కు తగ్గించి తొలిదశ పేరిట పూర్తిచేస్తామన్నట్టు కేంద్రం ప్రకటిస్తే దానిపై పరస్పరం కీచులాడు కుంటున్నాయి. ఇందుకోసం 17వేల కోట్లు మంజూరు చేస్తానని కేంద్రం తెలియజేసినట్టు రాష్ట్రం ప్రకటించింది. ప్రజలు ఘోషిస్తున్నట్టు పునరావాసానికి సంబంధించిన ప్రకటనేదీ వెలువర్చలేదు. ఇది కేంద్రానికి లొంగుబాటు అని టీడీపీ అంటుంటే తమ ఘనత అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. అంతేగాని ఎత్తు తగ్గింపుతో నిధుల కోత, పునరావాసానికి ఎగనామం గురించి పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి లిక్కర్‌ కుంభకోణంలో బీఆర్‌ఎస్‌తో ఏదో రాజీకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. గత వారం రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగాల్లో బీజేపీపై విమర్శ బదులు కాంగ్రెస్‌పై దాడి పెరిగిందని పరిశీలకులు అంటున్నారు.
అడుగు వెనక్కు
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కోణాన్ని అలావుంచితే దేశవ్యాపితంగా బీజేపీ నూతన వ్యూహాన్ని తీసుకుందని చెప్పే ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. మూడో సారి కూడా తన్నుకుంటూ వచ్చేస్తామని పైకి చెబుతున్నా తాము నమ్ముకున్న బ్రాండ్‌ మోడీ పలచబడిపోయిందనీ, ఓట్లను రాబట్టే శక్తి చాలడం లేదని, సంఫ్‌ు పరివార్‌ గ్రహించిన కారణంగానే ఈ కొత్త హడావుడి అంటున్నారు. ఆరెస్సెస్‌ అధికార పత్రికలోనే ఈ విషయం పరోక్షంగా అంగీకరించారు. మోడీ జనాకర్షణ హిందూత్వ భావజాలం మాత్రమే అధికారం తెచ్చిపెడతాయనుకుంటే పొరబాటని ఆ పత్రిక పేర్కొంది. ఆయన ఒక్కసారి ప్రచారానికి వస్తే ప్రజలు ఓట్లు గుమ్మరిస్తారనే భ్రమలు కర్నాటక అంతకు ముందు హిమచల్‌ప్రదేశ్‌ తొలగించాయి. ఫిబ్రవరిలో ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందునుంచే మోడీ అక్కడ కాలికి బలపం కట్టుకు తిరిగారు. 19 సభలు, ఆరు రోడ్‌ షోలు నిర్వహించారు. ప్రతిజ్ఞలు చేయించారు. ఇది గాక జెపి నడ్డా 16 రోడ్‌షోలు. స్మృతి ఇరానీ 19, రాజ్‌నాథ్‌ సింగ్‌ 4, హిమంత్‌ బిస్వాస్‌ శర్మ16 రోడ్‌షోలు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు కూడా విస్తారంగా తిరిగారు, అయితే విజయం సంగతి అటుంచి ఆ పార్టీ 31 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. మరి అమిత్‌ షా అదే పనిగా చెప్పుకున్న సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌, సోషల్‌ ఇంజనీరింగ్‌, పన్నా ప్రముఖ్‌ల ప్రచారం ఏమైంది? అంతకుముందు మీడియా తన వంతు ప్రచారం చేసింది. ఆఖరుకు ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎంపికపై సిద్దరామయ్య, శివకుమార్‌ తగాదా చీలిక వరకూ వెళుతుందన్న వాతావరణం కల్పించింది. ఇవన్నీ ఎన్ని చేసినా వీటన్నిటిని బట్టి బ్రాండ్‌ మోడీ బలహీనమైందని తేలింది. ఆయన 46 సభల్లో పాల్గొంటే అందులో 15 మాత్రమే గెలవగలిగారు.
పెరిగిన హడావుడి
కళ్లముందు కనిపించే ఈ వాస్తవాలను రాజకీయంగా ఒప్పుకోవడం బీజేపీకి మరీ ముఖ్యంగా మోడీకి తెలియనిపని. ప్రచార పటాటో పంకొనసాగించడమే వారి మార్గంగా ఉంటుంది. అందుకే ఆయన నమ్మకస్తుల ముఠా లోపాయికారిగానే చర్చచేసి చెప్పకుండా చేయాలనుకున్నది చేస్తుంది. తొమ్మిదేండ్ల పాలన వార్షికోత్సవాలను ఆర్బాటంగా చేయాలన్న ఆలోచనకు కొత్త ట్విస్టుతో ముందుకు తెచ్చింది. దేశవ్యాపితంగా 500నియోజకవర్గాల్లో సభలు తలపెట్టింది. ఓటర్లను ప్రభావితం చేయగల ఐదు లక్షల ప్రముఖ కుటుంబాలను కలుసుకో వలసిందిగా రాష్ట్రాల విభాగాలకు ఆదేశాలు వెళ్లాయి. నటీనటులను, సెలబ్రటీలను కలుసుకోవడం ఇందులో భాగమే. దేశంలోని మొత్తం నియోజకవర్గాలను 144 క్లస్టర్లుగా విభజించి ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి ఎనిమిది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారట. మోడీ హయాంలో హైవేలు ఇతర మౌలిక సదుపాయాలు గొప్పగా పెంచినట్టు చెప్పడానికి వికాస్‌ తీర్థ జరుపుతారు. గతంలో చారుపే చర్చ లాగే ఇప్పుడు టిఫిన్‌పే చర్చ ప్రహసనం సాగిస్తారు. దేశంలో 51 జాతీయ స్థాయి ర్యాలీలు జరుపుతారు. ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలో మోడీ మరోసారి ప్రచారంపై కేంద్రీకరిస్తారు. గతంలో ముఖ్యమంత్రులను మార్చడంలో కాంగ్రెస్‌ను గుర్తుచేసిన మోడీ నాయకత్వం ఆ పని విరమించింది. మరోవైపున రాష్ట్రాలలో మరీ దూకుడుగా ఉన్న అధ్యక్షులను మార్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఉదాహరణకు తెలంగాణలో ఉత్తరాది తరహా పద్ధతులతో ఉద్రిక్తతలకు కారణమైన బండి సంజరుని మార్చడం గురించిన చర్చ వాస్తవరూపం దాల్చుతుందంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినా ప్రయోజనం లేదని వాపోతున్న డికె అరుణ, ఈటెల రాజేందర్‌ వంటివారికి పదవులు ఇచ్చి సంతృప్తిపర్చే తతంగం తప్పదంటున్నారు. ఏపీలోనూ టీడీపీ నుంచి వచ్చిన నేతల ఒత్తిడి మేరకే చంద్రబాబును కలుసుకున్నట్టు చెబుతున్నారు.
సర్వేల సారం
అదానీ వ్యవహారంతో మొదలు పెట్టి అంతర్జాతీయంగానూ మోడీ ప్రభ మసకబారింది. అంతర్జాతీయ మీడియాలో వ్యతిరేక కథనాలను ఖండించడం ఒక పెద్ద కార్యక్రమంగా మారింది. ఇతర రాష్ట్రాలలో సర్వేలలో కూడా మోడీకి మద్దతు నలభై శాతం మించి ఉండటం లేదు. అదే సమయంలో వ్యతిరేకులు అసంతృప్తితో ఉన్నవారి శాతం అంతకంటే ఎక్కువగా ఉంటున్నది. మహారాష్ట్రలోనూ అదే అంచనా వచ్చింది. మరోవైపున మైనార్టీలలో అభద్రత సామాజిక శక్తుల చలనం ప్రతిపక్షాల ఐక్యత పెరుగుతున్నది. బీజేపీ మతతత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా చూడాలనే బావన బలపడుతున్నది. బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగే శిఖరాగ్ర సమావేశం దీనిపై స్పష్టమైన సంకేతాలివ్వచ్చు. 450 స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి నిలిచేలా చూడాలన్న నినాదం ఇందులో భాగమే. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా ఇది దేశంలో రాజకీయ వాతావరణాన్ని సూచిస్తున్నది. బీజేపీకి అనుకూలంగా ఉండే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా పార్లమెంటు ప్రారంభంలో స్వయంగా పాల్గొనకపోవడం యాదృచ్చికం కాదు. అదే సమయంలో వైసీప,ీ టీడీపీ, జనసేన మూడు ప్రాంతీయ పార్టీలు తనకు అనుకూలంగానే ఉన్నాయి గనక ఏం చేయాలనే వ్యూహమధనం సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. అందరినీ అందుబాటులో ఉంచుకోవాలనేదే అంతిమంగా తమ రాజకీయ అవసరమనేది బీజేపీ దాచుకోవడం లేదు. ఎటొచ్చి ఈ పార్టీలే తమ వైరుధ్యాలను తీర్చుకోవడానికి దానికి సాగిలబడుతుండటం రాష్ట్రానికి హానికలిగిస్తున్నది. ఇప్పట్లో ఇది ఎలా ముగిసేది ఇంకా స్పష్టం గాకున్నా వారి వైఖరిలో మాత్రం మార్పు వచ్చే సూచనలు లేవు. తెలంగాణలోనూ రాజకీయ దృశ్యం ఎలాంటి మార్పులకు లోనవుతుందనేది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిన బీజేపీ బలం పరిమితమే గనక ఎన్ని ఎత్తుగడలు పన్నినా అధికారంలోకి రావడం గాని, దేశవ్యాపితంగా బలాబలాల మార్పులో గాని పెద్ద ప్రబావం ఉండదు. హిందీ రాష్ట్రాలు మరీ ముఖ్యంగా యూపీ, గుజరాత్‌ వంటి చోట్ల బీజేపీని నిలవరించడం కీలక కర్తవ్యమవుతుంది. బీజేపీ, ఆరెస్సెస్‌ కూటమి తమ బలహీనతను గుర్తించిందని వారి కదలికలు చెబుతున్నాయి. మరి కాంగ్రెస్‌, ఇతర లౌకిక ప్రాంతీయ పార్టీలు కూడా పైన చెప్పుకున్నట్టు అవగాహన పెంచుకుని అడ్డుకునే దిశలో సాగుతాయా అన్నదే భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అదే సమయంలో అడుగు జారుతున్న సంఫ్‌ పరివార్‌ ముందుకుతెచ్చే విభజన రాజకీయాలను విద్వేష ప్రయత్నాలను కూడా విఫలం చేయవలసి ఉంటుంది.

తెలకపల్లి రవి

Spread the love