నవతెలంగాణ మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రిలో తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్ – ధనలక్ష్మి దంపతులు ఇక్కడ అప్పడాల వ్యాపారం చేస్తున్నారు. పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ధనలక్ష్మి (36), ఆమె కూతురు జీవని (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుమారుడు సిద్ధూ ఉదయం లేచి చూసేసరికి తల్లి, అక్క శవాలుగా కనిపించడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి రోజు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ నిన్న రాత్రి నుంచి రాకపోవడం.. అతడి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఘటనా స్థలాన్ని మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.