– కేంద్రం వైఖరికి కర్నాటక సీఎం నిరసన
– బెంగళూరులో బైటాయించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
యశ్వంత్పురా : కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధ రామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ తరఫున కేంద్రం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపామన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, కర్ణాటక రైతులను ద్వేషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 223 తాలూకాల్లో కరువు తాండవిస్తోందన్నారు. సెప్టెంబర్ 22న కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చామని.. ఆ తర్వాత కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించి వెళ్లిందన్నారు. కానీ అమిత్షా చెన్నపట్నం వచ్చి ప్రభుత్వం ఆలస్యంగా మెమోరాండం ఇచ్చిందని చెప్పారని మండిపడ్డారు. కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటి వరకు రైతులకు రూ.650 కోట్లు పంపిణీ చేశామన్నారు. నిర్మలా సీతారామన్, నరేంద్ర మోడీ కారణంగా కర్ణాటకకు ఊరట లభించలేదన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ కర్ణాటకకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలు తెరపైకి వస్తున్నాయన్నారు. రూ.18,172 కోట్లు ఇవ్వకుండా కర్ణాటక గడ్డపై అడుగుపెట్టే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు.