ఒకే దఫా రుణమాఫీ చేయాలి

– రైతులకు కొత్త రుణాలూ మంజూరు చేయాలి :తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ
రైతులకు ఒకే విడుతలో రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ నగరంలోని నాందేవ్‌వాడలో రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒకేసారి రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిదేండ్లు గడిచిపోతున్నప్పటికీ రుణ మాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంకులు వడ్డీలకు వడ్డీలు వేసి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పించాలని, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. పోడు భూములకు కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే పట్టాలు ఇస్తానని అన్నారని, అర్హులందరికీ పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వానాకాలం పంట వేసుకోవటానికి రైతులు సిద్ధపడుతున్న తరుణంలో నకిలీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యాసంగి పంటల డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాధరప్ప, పల్లపు వెంకటేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love